ప్రతిపక్షాల చేతికి వెళ్లకుండానే: రాజయ్యకు కెసిఆర్ ఓదార్పు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన టి. రాజయ్యకు ఓదార్పు మాటలు చెప్పారు. తప్పనిసరి పరిస్థితిలోనే తొలగించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. దాంతో తాను కెసిఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని టి. రాజయ్య కెసిఆర్తో భేటీ తర్వాత ప్రకటించారు. వివాదం ప్రతిపక్షాల చేతికి వెళ్లకుండా కెసిఆర్ రాజయ్యతో భేటీని ఉపయోగించుకున్నట్లు అర్థమవుతోంది. ప్రతిపక్షాల నేతలతో పాటు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నేత మందకృష్ణ మాదిగ కూడా రాజయ్య ఉద్వాసనపై కెసిఆర్ను తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
ఆ విమర్శలకు తెర వేయడానికే రాజయ్యను మచ్చిక చేసుకోవడానికి కెసిఆర్ ఆ భేటీని వినియోగించుకున్నట్లు అర్థమవుతోంది. బయటి విమర్శలను కట్టడి చేయడానికి అది పనికి వచ్చిందని అంటున్నారు. ప్రభుత్వంపై మచ్చ పడకూడదని తప్పనిసరి పరిస్థితుల్లోనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, తనకూ బాధ కలిగిందని, కానీ తప్పలేదని కెసిఆర్ రాజయ్యతో అన్నారు. మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత రాజయ్య తొలిసారి సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ను క్యాంపు కార్యాలయంలో కలిశారు.
గతనెల 25న మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత సీఎం కేసీఆర్తో రాజయ్య భేటీకి ప్రయత్నించినా, గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు, ఇతర కార్యక్రమాలతో సీఎం బీజీగా ఉండటంతో వీలు కాలేదు. సుమారు వారం రోజులపాటు కేరళకు వెళ్ళిన రాజయ్య ఆదివారం రాత్రికి హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తనను కలవాలని రాజయ్యకు సీఎం కేసీఆర్ సూచించారు. దీంతో టీఆర్ఎస్ వరంగల్ జిల్లా నేత పెద్ది సుదర్శన్రెడ్డి రాజయ్యతో మాట్లాడి వెంటపెట్టుకుని సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్ళారు.
అప్పుడు సీఎం కే చంద్రశేఖర్రావు వివిధశాఖల పనితీరుపై సీఎస్ రాజీవ్శర్మ తదితరులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తుండడంతో రాజయ్య ఆ గది బయటే నిలబడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ - అక్కడే ఎందుకు ఉన్నారని, నిన్నటి వరకు మనతోనే ఉన్నారు కదా అని, రాజయ్యా.. లోపలికి రా అంటూ పిలిపించినట్టు చెబుతున్నారు. సమీక్ష జరిగినంతసేపు అక్కడే కూర్చున్న రాజయ్య అధికారులు వెళ్ళిపోయిన తరువాత సుమారు 15 నిమిషాలపాటు సీఎంతో ఏకాంతంగా మాట్లాడినట్టు తెలుస్తున్నది. పాలన పారదర్శకంగా ఉండేందుకు కఠినమైన నిర్ణయం తప్పలేదని రాజయ్యతో సీఎం కేసీఆర్ చెప్పినట్లు సమాచారం.
అయినా కష్టకాలంలో అధికారపార్టీని వీడి తెరాసలో చేరి సేవలందించావని, ఉద్యమకారుడివని, నీ సేవలు పార్టీకి, ప్రభుత్వానికి చాలా అవసరం అని రాజయ్యతో సీఎం అన్నట్టు తెలిసింది. నీ స్థాయికి తగ్గకుండా నిన్ను చూసుకుంటా.. నేను ఉన్నాను కదా అని రాజయ్యను ఓదార్చినట్టు తెలుస్తోంది. "ముందు నీ నియోజకవర్గంపై దృష్టి పెట్టు. ఎలాంటి సమస్యలున్నా నేరుగా నన్నే సంప్రదించు. నువ్వు ఎలాంటి వ్యక్తివో నాకు తెలుసు. నీ నియోజకవర్గంపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. నువ్వే చూసుకోవాలి" అని రాజయ్యతో అన్నట్టు తెలుస్తోందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. తనను సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారని రాజయ్య తెలిపారు. తాను కేసీఆర్ సారధ్యంలోనే పనిచేస్తానని మీడియాతో చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను తాను సీఎంకు వివరించానన్నారు.