కొత్త జిల్లాలపై కేసీఆర్, కారు రంగు మార్చారు (ఫోటో)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు జిల్లాలు ఏర్పడనున్నాయనే వార్తల పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం స్పందించారు. జిల్లాల విభజన పైన వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దన్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతనే కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటుందని తెలిపారు.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి దశలో ఏడు జిల్లాల ఏర్పాటుకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని వార్తలు వచ్చాయి.
సిద్దిపేట, వికారాబాద్, కొత్తగూడెం, సూర్యాపేట, నాగర్ కర్నూలు, మంచిర్యాల, జగిత్యాలలు కేంద్రంగా కొత్త జిల్లాలు ఆవిర్భవించనున్నాయని, దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్లతో పాటు పరిపాలనను మరింత సులభతరంగా మార్చి ప్రజలకు మెరుగైన పాలనను అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుందని ప్రచారం జరిగింది.
పరిపాలనా వికేంద్రీకరణతోనే సత్వర అభివృద్ధి సాధ్యమన్న సంకల్పంతో మరో ఏడు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసిందని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రెవిన్యూశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసిందని వార్తలు వచ్చాయి.
కేసీఆర్ కాన్వాయ్ రంగు మారింది
కేసీఆర్ కాన్వాయ్ రంగు మారింది. ఇప్పటి వరకు సీఎం కాన్వాయ్లో నల్లని రంగు వాహనాలు వినియోగించారు. సీఎం కోరిక మేరకు బీడీఎల్లో వాహనాల రంగు మార్చారు. ఇవాళ గవర్నర్ నరసింహన్ను కలిసేందుకు రాజ్ భవన్ వచ్చిన కేసీఆర్ కాన్వాయ్లో మూడు తెల్లటి వాహనాలు ఉన్నాయి.