మల్కాజిగిరి లోకసభ: కెసిఆర్ అంత సాహసం చేస్తారా?
హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికలలో మల్కాజిగిరి లేదా సికింద్రాబాద్ లోకసభ స్థానాలలో ఏదో ఒక నియోజకవర్గం నుండి తాను పోటీ చేసే విషయమై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చర్చలు జరుపుతున్నారట. ఎన్నికల్లో కెసిఆర్ గజ్వేల్ అసెంబ్లీతో పాటు మరో లోకసభ నియోజకవర్గానికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో ప్రధానంగా మెదక్ లోకసభ నియోజకవర్గం వినిపిస్తోంది.
అయితే మల్కాజిగిరి లేదా సికింద్రాబాదుల పైనా ఆయన దృష్టి సారిస్తున్నారు. తెరాస తరఫున మల్కాజిగిరి స్థానానికి ఇప్పటి వరకు ఎవరి పేరును పరిశీలించలేదు. సికింద్రాబాదులో కూడా గట్టి అభ్యర్థి కోసం చూస్తోంది. సికింద్రాబాదులో దాసోజు శ్రవణ్ పేరు వినిపించినా ఆయన భువనగిరి శాసన సభ స్థానం నుండి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో సికింద్రాబాదు నుండి తాను పోటీ చేసే విషయమై కెసిఆర్ చర్చిస్తున్నారు.
అదే సమయంలో మల్కాజిగిరి పైనా చర్చిస్తున్నారు. పార్టీ చేయించిన సర్వేలో సికింద్రాబాద్, మల్కాజిగిరిలలో కాంగ్రెసుతో పోటీ పడే స్థాయిలో తెరాసకు ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది. దీంతో వీటిపై కెసిఆర్ కసరత్తు చేస్తున్నారు. తాను స్వయంగా సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి బరిలో దిగితే గ్రేటర్ హైదరాబాదులో పార్టీని బలోపేతం చేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారట.
గతంలో తాను మహబూబ్ నగర్ నుండి పోటీ చేసిన సమయంలోను ఇబ్బంది అవుతుందని చెప్పారని కానీ, తాను రిస్క్ తీసుకోవడానికి సిద్ధమై పోటీ చేసి గెలిచానని కెసిఆర్ గుర్తు చేస్తున్నారట. గ్రేటర్ హైదరాబాదులో పార్టీని బలోపేతం చేయడానికి తాను సాహసం చేస్తే ఎలా ఉంటుందో చెప్పాలని కోరుతున్నారట. మల్కాజిగిరి లోకసభ పరిధిలో సీమాంధ్ర ప్రాంతం వారు ఎక్కువగా ఉంటారు.