కెసిఆర్ కొత్త పాలనా యోచన: వారికి ఒకే కాంప్లెక్స్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. పాలనా సౌలభ్యం కోసం ఆయన ఈ నూతన యోచనతో ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, పోలీసు కమిషనర్ల క్యాంప్ కార్యాలయాలు, నివాసాలు ఒకే చోట ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆలోచిస్తున్నారు. అందుకు ఓ కాంప్లెక్స్ నిర్మించాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం
ఉన్నతాధికారులు ఒకే చోట ఉంటే, సమన్వయం సులభమవుతుందని కెసిఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. సచివాలయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ను హోం మంత్రి నాయని నర్సింహారెడ్డి, డిజిపి అనురాగ్ శర్మ కలిశారు. ఇంటిలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి కూడా కెసిఆర్తో సమావేశమయ్యారు.
ఆ సమావేశాల్లోనే కెసిఆర్ తన ఆలోచనను వారి ముందు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకుగాను షేక్పేట మండలంలో స్థలాల అన్వేషణ కూడా ప్రారంభమైనట్లు చెబుతున్నారు. మూడు ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
బంజారాహిల్స్ ప్రాంతంలో ఆ కాంప్లెక్స్ ఉండేలా చూడాలని కెసిఆర్ అనుకుంటున్నారు. ఓ స్థలాన్ని ఎంపిక చేసిన తర్వాత యుద్ధప్రాతిపదికపై భవనాల నిర్మాణం కూడా సాగుతుందని అంటున్నారు. ఉన్నతాధికారుల నివాసాలు, క్యాంప్ కార్యాలయాలు ఒకే చోట ఉండడం వల్ల పాలనలో సౌలభ్యం ఏర్పడుతుందనేది కెసిఆర్ ఆలోచనగా చెబుతున్నారు.