కెసిఆర్ను అభినందిస్తూ ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో ఫ్లెక్సీలు (ఫోటోలు)
రాజమండ్రి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలంగాణలో, ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఫ్లెక్సీలు కట్టడం ఆశ్చర్యమేమీ కాదు. కానీ తెలంగాణ కోసం ఉద్యమించిన కెసిఆర్ ఫ్లెక్సీ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించడం కొంత ఆశ్చర్యమే.
గతంలో కెసిఆర్ అమరావతి శంకుస్థాపన కోసం వెళ్లినప్పుడు స్థానిక టిడిపి నేతలు కెసిఆర్కు స్వాగత ఫ్లెక్సీలు కట్టారు. అయితే, తాజాగా ఏపీలో ఆయనకు స్వాగత ఫ్లెక్సీలు కాదు... అభినందనల ఫ్లెక్సీలు కట్టడం గమనార్హం. ఇది తూర్పు గోదావరి జిల్లా వై రామవరం మండలంలో చోటు చేసుకుంది.
ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కెసిఆర్కు అభినందన ఫ్లెక్సీలు కట్టారు. 'తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగుల చీకటి జీవితాలలో వెలుగును ప్రసాదించిన ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖఱ రావు గారికి మా శతకోటి వందనములు' అంటూ ఫ్లెక్సీ కట్టారు.
అందులో ఇట్లు.. కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం, వై.రామవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా, అంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. కాగా, ఈ ఫ్లెక్సీలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అవమానించడంగా స్థానిక టిడిపి నేతలు భావించారట. దీంతో, వాటిని తొలగించాలని పంచాయతీ కార్యదర్శిని కోరారని తెలుస్తోంది.