700 కోట్ల అప్పు! కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత అరెస్ట్, ఇంజెక్షన్ సైకో ఎఫెక్ట్: ముక్కు నుంచి రక్తం
కర్నూలు: కేశవ రెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవ రెడ్డిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. తమ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్లు సేకరించి తిరిగి చెల్లించని నేపథ్యంలో బుధవారం రాత్రి అతనిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు చెప్పారు.
కేశవ రెడ్డి దాదాపు రూ.700 కోట్ల అప్పులు చేసి ఎగవేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కేశవ రెడ్డి విద్యా సంస్థలు రూ.1 నుంచి రూ.2 లక్షల వరకు డిపాజిట్లు చెల్లించారు.
వాటిని అడగడంతో... పదో తరగతి పూర్తయ్యాక తిరిగి చెల్లిస్తామని చెప్పారు. అయితే, ఇప్పటి వరకు చాలామందికి చెల్లించలేదు. దీంతో వారు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, గత రెండేళ్లలో కేశవ రెడ్డి విద్యా సంస్థలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినట్లుగా తెలుస్తోంది.
కర్నూలు జిల్లాలోని నంద్యాలకు చెందిన కేశవ రెడ్డి తన సొంతూరులో చిన్న స్కూల్ ఏర్పాటు చేసి అంచెలంచెలుగా ఎదిగారు. కేశవ రెడ్డిని పోలీసులు కోర్టు ఎదుట హాజరుపర్చనున్నారు. కేశవ రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకునే అవకాశముంది.
ఇంజెక్షన్ గుచ్చిన పదిహేను రోజులకు నోటి నుంచి రక్తం
సుమారు పదిహేను రోజుల క్రితం సైకో సూదిగాడి బారిన పడ్డ ఓ బాధితురాలి పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో గంటా చంటి అనే మహిళ రోడ్డుపై వెళ్తుండగా మోటార్ సైకిల్ పైన వచ్చిన ఇంజెక్షన్ సైకో వెనుక నుంచి సూది పొడిచి పరారయ్యాడు.
వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. అయితే, ఇప్పటికి బాగానే ఉన్నా, ఆమె ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించింది. బుధవారం ముక్కు, నోటి నుంచి రక్తం కారింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో ఆ ఇంజెక్షన్ సైకో ఏం గుచ్చాడన్న విషయమై చర్చ సాగుతోంది.