ఇంకా బాల్స్: బొత్సకు కిరణ్ కౌంటర్, రాజీనామా పైనా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యనస్థీకరణ బిల్లును (తెలంగాణ ముసాయిదా) లోకసభలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం స్పందించారు. అదే సమయంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణలకు చురకలు అంటించారు.
ఇప్పటికీ ఆట ముగియలేదని, ఇంకా చాలా బంతులు మిగిలే ఉన్నాయని కిరణ్ ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటులో చోటుచేసుకున్న సంఘటనలు బాధాకరమన్నారు. ఎంత పెద్ద సమస్యనైనా చర్చల ద్వారానే పరిష్కరించగలమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి రెండు ప్రాంతాల నేతలతో చర్చలే పరిష్కారాన్ని చూపుతాయన్నారు.

తెలంగాణ బిల్లు సభలో ప్రవేశ పెట్టడంతోనే పని అయిపోయినట్లు కాదన్నారు. ధైర్యముంటే మతతత్వ భారతీయ జనతా పార్టీ మద్దతును కాంగ్రెసు పార్టీ కోరుతోందని ప్రశ్నించారు. ఇప్పటికీ తమ నాయకురాలు సోనియా గాంధీయేనని అయితే, విభజన విషయంలో మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు.
తన మనసు గాయపడిందని చెబుతున్న మన్మోహన్కు ఇక్కడ కోట్లాది ప్రజల తెలుగువారి మనసు అర్థం కావడం లేదా అన్నారు. కోట్లాది తెలుగు ప్రజల మనసును ఆయన అర్థం చేసుకోవాలన్నారు. సమైక్యాంధ్ర కోసం డిమాండ్ చేస్తున్న ఎంపీల సస్పెన్షన్ దురదృష్టకరమన్నారు. మ్యాచ్ ఇంకా పూర్తి కాలేదని, చివరి బాల్ ఇంకా ఉందన్నారు.
గందరగోళం మధ్య బిల్లు పెట్టడం సరికాదన్నారు. ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదని అభిప్రాయపడ్డారు. కేంద్రం తీరు చూస్తుంటే ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం కోల్పోయేలా కనిపిస్తోందన్నారు.
బొత్స వ్యాఖ్యలపై..
రాజీనామాలపై తమకు సలహాలు ఇచ్చే వాళ్లు ముందే రాజీనామా చేసి ఉండే బాగుండేదని బొత్స వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అందరితో చర్చించాకే తాము పదవుల్లో కొనసాగుతున్నామన్నారు. తన రాజీనామా పైన సీమాంధ్ర నేతలతో చర్చించాక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.












Click it and Unblock the Notifications