కిరణ్ విశ్వాసపాత్రుడు, హైద్రాబాద్పై చర్చించలేదు: డిగ్గీ
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు పార్టీకి విశ్వాసపాత్రుడు అని, అలాగే కాంగ్రెసు పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ మంగళవారం చెప్పారు. న్యూఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
కొత్త రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ పైన తాము చర్చిస్తున్నామన్నారు. తెలంగాణకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం వెళ్తుందా లేదా ఇప్పుడే తాను చెప్పలేనని స్పష్టం చేశారు. తీర్మానంపై కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో చర్చించానన్నారు.
రాజ్యాంగబద్దంగా కొత్త రాష్ట్రం ఏర్పడుతుందన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. సిడబ్ల్యూసి నిర్ణయం అందరికీ శిరోధార్యమని చెప్పారు. జివోఎం పంపిన కొత్త షెడ్యూల్ ప్రకారం తీర్మానంపై నిర్ణయం ఉంటుందని చెప్పారు.
హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయడంపై ఎవరితోను తాము చర్చించలేదన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు తమ రాజీనామాలను ఉపసంహరించుకోవాలని కోరారు. వారు వాస్తవాన్ని గ్రహించాలన్నారు. విభజపై కేంద్రం రాజ్యాంగపరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.