మదిలో అసెంబ్లీ రద్దు, మానసికంగా సిద్ధం చేస్తున్నకిరణ్!
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టే రోజునే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే రాజీనామాతో పాటు పలు అంశాలపై ఆయన ఆలోచిస్తున్నారట. రాజీనామా చేయడమా? అసెంబ్లీని రద్దు చేయడమా? అనే అంశాలపై కిరణ్ మల్లగుల్లాలు పడుతున్నారట. రాజీనామా అంశంపై పలువురు నేతలతో చర్చిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది.
అదే సమయంలో అసెంబ్లీ రద్దు గురించి కూడా అభిప్రాయాలు తీసుకుంటున్నారట. శనివారం ఎంపి రాయపాటి సాంబశివ రావు, మంత్రులు పితాని సత్యనారాయణ, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టిజి వెంకటేశ్, కొండ్రు మురళీ, పార్థసారథి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా, రాష్ట్ర విభజన బిల్లును రాష్ట్రపతికి పంపిన తర్వాత దానిని రాజ్యసభలో ప్రవేశపెట్టిన వెంటనే అంటే ఈనెల 12న లేదా 13న రాజీనామా చేయడం ఉత్తమమని అనుకుంటున్నానని, తప్పుల తడకంటూ అసెంబ్లీ తిరస్కరించిన బిల్లునే పార్లమెంటులో పెడుతుంటే ఇంకా పదవిలో కొనసాగడం నైతికంగా సరికాదని సిఎం వారికి స్పష్టం చేశారట.

అయితే ఇప్పుడే రాజీనామా వద్దని ఓ సీనియర్ మంత్రి ఒకరు సిఎంకు నచ్చజెప్పాలని చూశారు. మరోసారి ఆలోచించాలని సూచించారు. కానీ, కిరణ్ మరో మాటకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన తర్వాతే రాజీనామా చేయడం ఉత్తమమని మరో మంత్రి సూచించారట. శాసనసభ తిరస్కరించిన బిల్లును ఎలా ఆమోదిస్తామంటూ బిజెపి మెలిక పెడుతోందని, ఆ పార్టీ ముఖ్యమంత్రే కాంగ్రెస్ మాట విననప్పుడు తామెలా మాట వింటామంటూ బిజెపి చేస్తున్న వాదన ప్రస్తావనకు వచ్చింది.
తెలంగాణకు మద్దతు ఇస్తామని ఇప్పటి వరకూ చెబుతూ వచ్చిన బిజెపి ఇప్పుడు అడ్డం తిరుగుతోందని, అందుకే, దిగ్విజయ్ సింగ్, సుశీల్ కుమార్ షిండే, అహ్మద్ పటేల్ వంటి వారు బిజెపి నేతలతో మాట్లాడుతున్నారని వారి మధ్య చర్చకు వచ్చింది. తెలంగాణ బిల్లును నెగ్గించుకుంటామంటూ చెబుతూ వచ్చిన కేంద్రం ఇప్పుడు గతంలో సానుకూలంగా లేఖలు ఇచ్చినందున మాట మీద నిలబడాలంటూ దాదాపు పార్టీకు విజ్ఞప్తి చేసే పరిస్థితి వచ్చిందని, ఇది కిరణ్ విజయమేనని, అసెంబ్లీలో బిల్లు తిరస్కరణకు గురైన తర్వాతే బిజెపి వైఖరిలో మార్పు వచ్చిందని వారు ముఖ్యమంత్రికి చెప్పారట.
అధికారంలో కొనసాగుతూనే న్యాయ పోరాటం చేస్తే బాగుంటుందని మంత్రులు సూచించగా, కిరణ్ వారి వాదనను కొట్టి పారేసినట్లుగా తెలుస్తోంది. రాజీనామాకు సిద్ధమంటూ నేతలను మానసికంగా సిద్ధం చేసే పనిలో కిరణ్ పడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కిరణ్ రాజీనామా చేస్తున్నారన్న సమాచారంతో విజయవాడ ఎంపి లగడపాటి శనివారం హైదరాబాద్ వచ్చారు. క్యాంపు కార్యాలయంలో కిరణ్తో సుదీర్ఘంగా భేటీ అయి వారించారు.












Click it and Unblock the Notifications