డిగ్గీతో మాట్లాడిన కిరణ్, వివరాలకు నో!: చిరంజీవి కూడా
న్యూఢిల్లీ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. పలువురు నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. అయితే భేటీ వివరాలను వెల్లడించేందుకు మాత్రం ఆయన నిరాకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. సాయంత్రం జరగనున్న సమన్వయ కమిటీ భేటీలో పాల్గొనేందుకు కిరణ్ ఢిల్లీకి వచ్చారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు ఎపి భవన్ చేరుకున్న కిరణ్ పలువురు రాష్ట్ర నేతలతో భేటీ అయ్యారు. పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ఆయనను కలిశారు. అనంతరం ఆయన మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్రమంత్రి జైరామ్ రమేష్తో భేటీ అయ్యారు. అతనితో పావుగంటకు పైగా సమావేశమయ్యారు.
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్తో భేటీ అయ్యారు. విభజన నిర్ణయం వచ్చాక డిగ్గీ, కిరణ్లు నేరుగా మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. గతంలో ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇరువురు ఒకరిపై మరొకరు పరోక్ష వ్యాఖ్యలు కూడా చేసుకున్నారు.
డిగ్గీతో కిరణ్ భేటీ అనంతరం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర సమితి నేత విఠల్ పాల్గొన్నారు. డిసిఎంతో భేటీ అనంతరం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి దిగ్విజయ్తో సమావేశమయ్యారు.
పదేళ్ల పాటు నో
హైదరాబాదును పదేళ్ల పాటు గవర్నర్ పాలనకు అంగీకరించేది లేదని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాస్ గౌడ్, దేవి ప్రసాద్ హైదరాబాదులో అన్నారు. కేంద్ర హోంశాఖకు పంపిన నివేదికలను తయారు చేసిన అధికారుల పేర్లు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
నెక్లెస్ రోడ్డులో అమరుల స్థూపం: మందకృష్ణ మాదిగ
నెక్లెస్ రోడ్డులో తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ప్రభుత్వమే అమరుల దినోత్సవాన్ని జరిపించాలన్నారు. ప్రాణత్యాగం చేసిన వారి చరిత్ర లేకుండా రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పాఠ్యపుస్తకాల్లో అమరవీరుల చరిత్రలను చేర్చాలన్నారు. ఎల్లుండి కడుపుకోత సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.