చేసి చూపించా: ప్రజలకు కిరణ్ లేఖ, 4 పార్టీలపై ధ్వజం
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం తెలుగు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెసు, బిజెపి, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు పచ్చని రాష్ట్రంలో చిచ్చు పెట్టాయని మండిపడ్డారు. తెలుగు జాతి అభివృద్ధికే తన జీవితమని, తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పాటుపడతానని చెప్పారు. అధికారంలో ఉంటగా తాను పలు పథకాలను ప్రవేశ పెట్టానని, ఒక్క బుల్లెట్ వాడకుండా శాంతిని పరిరక్షించానని చెప్పారు.
కిరణ్ తన లేఖలో మరోమారు సమైక్యవాదాన్ని బలంగా వినిపించారు. సామాన్యుడి సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల ఫలితాలు అందరికీ అందుతున్న సమయంలో ఈ రాజకీయ పార్టీలన్నీ రాష్ట్రాన్ని విభజించేందుకు సహాయపడ్డాయని, అభివృద్ధి, సంక్షేమంతోపాటు పారిశ్రామిక ప్రగతి, హైదరాబాద్ను అన్ని రంగాల్లో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సమయంలో ఓ ప్రాంతం వారిని ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

అంకిత భావంతో పని చేసే సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నతాధికారుల బృందం, రాష్ట్ర ప్రజల పూర్తి సహకారంతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన అందించామని, దీనిని గుర్తించే ఇండియాటుడే ప్రతిష్ఠాత్మకమైన అవార్డు ఇచ్చిందని వివరించారు.
తాను ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించే నాటికి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, శాంతిభద్రతల పరిస్థితి సంక్షోభంలో ఉన్నాయని, సిఎంగా మొదటి ఏడాది ఆర్థిక సంక్షోభ పరిస్థితులను అధిగమిస్తామని, రెండో ఏడాది అన్ని ప్రాంతాల్లో, అన్ని రంగాల్లో మంచి వాతావరణం-స్థిరత్వం కల్పిస్తామని, మూడో ఏడాది సరికొత్త పథకాలతో అభివృద్ధి, సంక్షేమాలను సమన్వయం చేసుకుంటూ ప్రగతిని సాధిస్తామని సిఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజునే ప్రకటించానని, అది చేసి చూపించానన్నారు.
తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో సకల జనుల సమ్మెలు, మిలియన్ మార్చ్, చలో హైదరాబాద్, రాస్తారోకోలు, రైలు రోకోలు వంటి తీవ్రమైన ఆందోళనలు, ఉద్యమాలు నడిచినప్పటికీ సాధారణ ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎక్కడా ఒక్క రబ్బరు బుల్లెట్ అయినా ప్రయోగించకుండా పరిస్థితులను అదుపులోకి తెచ్చామన్నారు. మూడేళ్ల తన ముఖ్యమంత్రి హయాంలో సాధించిన విజయాలను కిరణ్ వివరించారు.
ప్రతి కుటుంబానికి కనీసం నాలుగు ప్రయోజనాలు దక్కాయని, విద్యార్థుల స్కాలర్షిప్లు, మహిళలు, రైతుల పావలా వడ్డీ రుణాలు, విద్యుత్ సబ్సిడీలు, చేసిన పనులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బిల్లులు దాదాపు రూ.15వేల కోట్ల పాత బకాయిలు అన్నింటినీ పూర్తిగా తీర్చడమే కాకుండా అప్పటికే అమలు జరుగుతున్న అన్ని పథకాలనూ కొనసాగించామన్నారు.
ఇన్ని సంక్షోభాలు, ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నామని, వనరుల వసూళ్లలో లోపాలను తొలగించి, లీకేజీలను అరికట్టి, విధానాల్లో పారదర్శకతను తెచ్చామని, నిరంతర పర్యవేక్షణ, పూర్తి పారదర్శకత, వసూళ్లపై ప్రత్యేక దృష్టి వంటి విధానాలతో ఆర్థిక క్రమశిక్షణను నెలకొల్పామని, అందువల్లనే అప్పటికి రూ.46 వేల కోట్లు ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రూ.80 వేల కోట్ల పైచిలుకు చేర్చగలిగామన్నారు. 15వేల కోట్ల పాత బకాయిలు తీర్చామన్నారు.












Click it and Unblock the Notifications