నేడే కిరణ్ రిజైన్, రాష్ట్రపతిపాలన? వెంకయ్య డిమాండ్స్

మంత్రి పితాని సత్యనారాయణ సోమవారం సాయంత్రం మాట్లాడుతూ... బిల్లుపై చర్చ ప్రారంభమైతే రేపే కిరణ్ రాజీనామా చేస్తారని చెప్పారు. రాజీనామాపై నిర్ణయాన్ని తాము కిరణ్కే కట్టబెట్టామన్నారు. ఆయన రాజీనామాకే మొగ్గు చూపుతున్నారని చెప్పారు. కిరణ్ కొత్త పార్టీ పెడితే తాను అందులో చేరుతానని తెలిపారు. ఎంపీల బహిష్కరణ పైన కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
మరోవైపు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణతో సీమాంధ్ర ప్రాంత మంత్రులు భేటీ అయ్యారు. బొత్సతో మంత్రులు కన్నా లక్ష్మీ నారాయణ, రఘువీరా రెడ్డి, సి రామచంద్రయ్య, బాలరాజు, కొండ్రు మురళి పాల్గొన్నారు.
కిరణ్పై సిఆర్ నిప్పులు
ముఖ్యమంత్రి పైన సి రామచంద్రయ్య నిప్పులు చెరిగారు. కిరణ్ కొత్త పార్టీ, రాజీనామా నిర్ణయాలు చారిత్రక తప్పిదమన్నారు. విభజన సెంటిమెంటుతో రాజకీయ లబ్ధి పొందాలని కిరణ్ చూస్తున్నారని, అప్పుడు జగన్కు, కిరణ్కు తేడా ఏముందన్నారు.
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ విధానాన్ని వివరిస్తూ లోకసభ సచివాలయం సోమవారం ఆరు పేజీల బులెటిన్ విడుదల చేసింది. గతంలో ఏ రాష్ట్రాలు ఏ చట్టాల ప్రకారం విడిపోయాయో బులెటిన్లో సచివాలయం పేర్కొంది. ఆ బులెటిన్ ప్రతులను లోకసభ సభ్యులకు అందజేశారు.
అసలు సమస్య అక్కడే: వెంకయ్య
అసలు సమస్య సీమాంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య లేదని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వం మధ్యే ఉందని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. తమతో చర్చించి ఒప్పుకున్న ప్రతిపాదనలేవీ బిల్లులో లేవని, ఆ ప్రతిపాదనలను కేంద్రం సవరణ రూపంలో తెస్తామంటోందన్నారు.
సీమాంధ్ర ప్రజల పరిష్కారం విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధితో వ్యవహరించాలని సూచించారు. సీమాంధ్ర కోల్పోతున్న ఆదాయ భర్తీపై సముచిత నిర్ణయం తీసుకోవాలని, సీమాంధ్రకు అసంఘటిత నిధి నుంచి 10వేల కోట్లు కేటాయించాలని, ఉత్తరాంద్ర, రాయలసీమలో పరిశ్రమలకు పదేళ్లు వంద శాతం మినహాయింపు ఇవ్వాలని తెలిపామన్నారు.
హిమాచల్ ప్రదేశ్ తరహాలో సీమాంధ్రలో పన్ను మినహాయింపు ఇవ్వాలన్నారు. ఆ తర్వాతే పదేళ్లు 50శాతం పన్ను మినహాయింపు ఇవ్వాలన్నారు. ఇక సభను సజావుగా నడిపించే బాధ్యత ప్రభుత్వానిదే అని తాము స్పష్టం చేసినట్లు వెల్లడించారు. మధ్యాహ్నం భేటీ సందర్భంగా అద్వానీ సవరణలపై అసంతతృప్తి వ్యక్తం చేశారన్నారు.












Click it and Unblock the Notifications