జగన్- కిరణ్ ఒక్కటే: కొండ్రు, జగన్పై సురేఖ: గండ్ర
హైదరాబాద్: సీమాంధ్ర ప్రజలను మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మోసం చేశారని సీమాంధ్రకు చెందిన తాజా మాజీ మంత్రి కొండ్రు మురళి విమర్శించారు. రాష్ట్ర విభజనకు సహకరించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
రాష్ట్రం విడిపోక ముందు చేయాల్సిన కార్యక్రమాలకు చంద్రబాబు, జగన్ సహకరించలేదని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోవడానికి చంద్రబాబు అవసరమైన సహాయసహకారాలు అందించారని, ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని జగన్ సూచించారని, అంతా సహకరించి ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం సరి కాదని ఆయన అన్నారు. ఇప్పటికైనా వారు సీమాంధ్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలని ఆయన సూచించారు.

సోనియా, రాహుల్ గాంధీలకు తెలంగాణవాళ్లు చుట్టాలు, సీమాంధ్రవాళ్లు కారు అనేది సరైంది కాదని ఆయన అన్నారు. సీమాంధ్రపై ప్రేమతోనే ఆర్థిక ప్యాకేజీ ఇచ్చారని, పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రకు ఇచ్చారని, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలూ సహకరించాయని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీలో ఉన్నందుకు తాను గర్విస్తున్నానని ఆయన అన్నారు. తాను కాంగ్రెసు పార్టీలోనే ఉంటానని, దేనికైనా తెగిస్తానని కొండ్రు మురళి చెప్పారు.
రాజీనామాలు చేయాలనుకుంటే స్పీకర్ను కలిసి లేఖలు ఇవ్వాలని ఆయన అన్నారు. దొంగ రాజీనామాలు చేస్తున్నారని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి జగన్కు తేడా లేదని, జగన్కు నాయకత్వ లక్షణాలున్నాయని, కిరణ్ కుమార్ రెడ్డికి అవి కూడా లేవని ఆయన అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించబోమని ఆయన అన్నారు. కాంగ్రెసును వదిలేసిన కిరణ్ కుమార్ రెడ్డిని తాము వదిలేశామని చెప్పారు. ప్రజారాజ్యం నుంచి వచ్చిన నేతలు సమైక్యం కోసం ఏదో చేశామని చూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
కాంగ్రెసు వల్ల వైయస్ రాజశేఖర రెడ్డికి, వైయస్ వల్ల జగన్కు గుర్తింపు వచ్చిందని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా, స్నేహితుడిగా మాత్రమే చూశామని ఆయన చెప్పారు. కాంగ్రెసు వందేళ్లు గెలవదని చెప్పడానికి జగన్ దేవుడా అని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలతో ప్రజలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి విమర్శించారు. జగన్ నిజస్వరూపం ఏమిటో కొండా సురేఖను అడిగితే చెబుతారని ఆయన అన్నారు. సోనియాను నియంత అంటున్న జగన్ సబ్బం హరి, మారెప్పలను అడిగితే ఎవరు నియంతో చెబుతారని ఆయన అన్నారు. కాంగ్రెసులో పుట్టిన జగన్ సోనియాపై విమర్శలు చేస్తూ విర్రవీగుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications