కిరణ్ రెడ్డి ప్రెస్ మీట్లే పెడ్తారు, మా స్థాయి అదే: డొక్కా
గుంటూరు/ హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ముఖ్యమంత్రి కొత్త పార్టీ పెట్టరని, ప్రెస్ మీట్లు మాత్రమే పెడతారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తనదీ ముఖ్యమంత్రిదీ నియోజకవర్గం స్థాయి మాత్రమేనని ఆయన అన్నారు.
తమలాంటివారికి పదవులు ఇచ్చిన కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని తాము ధిక్కరిస్తామా అని ఆయన అడిగారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను వ్యక్తం చేసిన సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెర వెనక చర్యలకు దిగుతున్నారనే విషయాన్ని తాను నమ్మబోనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రెండు చేతులతో ఏ పనుల మీద సంతకాలు పెడుతున్నారో తెలియడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
దేశం విడిచి వెళ్లడమే: గాలి
సీమాంధ్రుల అభిప్రాయాలకు గౌరవం లేనప్పుడు దేశం విడిచి వెళ్లిపోవడమే ఉత్తమమని తెలుగుదేశం సీమాంధ్ర నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. రాష్ట్ర శాసనసభ తిరస్కరించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించడం సిగ్గు చేటు అని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలంగాణ బిల్లుకు సహకరించాలి: రాథోడ్
ఈ నెల 18వ తేీదన పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులందరూ సహకరించాలని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్ విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో రౌడీల్లా ప్రవర్తించిన లగడపాటి, మోదుగుల, జగన్లను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. అటువంటివారు సభలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.