తుపాకి రాముడిలా కట్టె, మ్యాప్: కిరణ్ రెడ్డిపై కెసిఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాటలపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పాలన పెట్టయినా సరే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కాంగ్రెసు అధిష్టానాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో శనివారం జరిగిన పార్టీ సభలో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తొలగించి ఏ పద్ధతిలో వీలైతే ఆ పద్ధతిలో తెలంగాణ ఇవ్వాలని ఆయన కోరారు.
కృష్ణా నది ఎక్కడి నుంచి ఎటు పోతుందో చెప్పడానికి కట్టె, మ్యాప్ కావాలా అని ఆయన ముఖ్యమంత్రి తీరును ప్రశ్నించారు. తుపాకి రాముడిలా కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించారని ఆయన అన్నారు. ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే ముఖ్యమంత్రివా అని ఆయన కిరణ్ కుమార్ రెడ్డిని అడిగారు. తెలంగాణ కావాలని తెలంగాణ బిడ్డలంతా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణవాదం ప్రతి వ్యక్తి గుండెలో ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రివి పచ్చి అబద్ధాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కట్టుకథలు, పిట్టకథలు చెప్పారని ఆయన అన్నారు.
తాము అక్రమంగా నీళ్లు తీసుకుని పోతున్నాం, తీసుకుపోతాం, మీరు పడి ఉండాలని ముఖ్యమంత్రి చెబుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో 60,70 వేల మంది సీమాంధ్ర ఉద్యోగులున్నారని ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అంగీకరిస్తున్నారని ఆయన చెప్పారు. మేం దొంగలం, బాజాప్తా దోచుకుంటాం, సమైక్యంగా ఉండాలని వాళ్లు అంటున్నారని ఆయన అన్నారు. జబర్దస్తీ, జులుం, దోపిడీ కొనసాగుతూనే ఉంటుంది, పడి ఉండాలని అంటున్నారని కెసిఆర్ అన్నారు. ఇంత జరిగిన తర్వాత కలిసి ఉండడం సాధ్యమా అని అడిగారు. సమైక్యాంధ్ర ఉద్యమం జుగుప్సాకరమైందని ఆయన అన్నారు.
సీమాంధ్ర నాయకులు చేస్తున్న కుట్రలు కాంగ్రెసు అధిష్టానానికి ఇప్పుడైనా తెలిసి ఉంటాయని, దారిన పోయే దానయ్య కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే ఇప్పుడు అధిష్టానాన్నే ధిక్కరిస్తున్నారని ఆయన అన్నారు. ఇంత కాలం తెలంగాణవాళ్లను వాళ్లు ఎంతగా రాచి రంపాన పెట్టి ఉంటారో తెలిసి ఉంటుందని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని పనికి మాలిన ముఖ్యమంత్రిగా ఆయన అభివర్ణించారు.
తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ముఖ్యమంత్రి వందల సార్లు చెప్పారని, ఇప్పుడు మాట మార్చి అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చరిత్రను రేపు చెబుతానని ఆయన అన్నారు. ఈ రోజు వందల కోట్లు సంపాదిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిన తర్వాత ఫైళ్లపై ముఖ్యమంత్రి జోరుగా సంతకాలు చేస్తున్నారని, తెలంగాణ ఏర్పడిన తర్వాతా వాటని సమీక్షిస్తామని, చట్టానికి కిరణ్ కుమార్ రెడ్డి అతీతులు కారని, చట్టం నుంచి తప్పించుకోలేరని ఆయన అన్నారు.