వైయస్ జగన్ కౌంటర్: బెడిసికొట్టిన కిరణ్ రెడ్డి వ్యూహం
తెలంగాణ ముసాయి బిల్లుపై చర్చను ప్రారంభించి అందులోని లోపాలపై సవరణలు కోరి దానిపై ఓటింగ్ కోరాలని, తద్వారా మరింత సమయం కావాలని రాష్టప్రతిని కోరాలని, సమయం ఇవ్వకపోతే తీవ్ర నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి వ్యూహరచన చేశారు. ఇందుకోసం ఆయన శాసనసభా వ్యవహారాల మంత్రిత్వశాఖను సైతం తనకు అనుకూలమైన మంత్రి శైలజానాథ్కు అప్పగించారు. అయితే సమైక్య తీర్మానం చేపడితేనే సభలో తెలంగాణ బిల్లుపై చర్చకు సహకరిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ వేస్తున్న వ్యూహంతో సీఎం శిబిరం చిత్తవుతోందని తెలుస్తోంది.
వైయస్సార్ కాంగ్రెసు సభ్యులను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి, బిల్లుపై చర్చను సాగించాలని బిజెపి, సిపిఐ, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ టిడిపి శాసనసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యులను, తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులను సస్పెండ్ చేస్తే సీమాంధ్ర ఆ రెండు పార్టీలకు కలిసి వస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో అటు వైయస్సార్ కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయించలేక, శాఖల మార్పు చేసినా తన వ్యూహాన్ని పదునుపెట్టలేక కిరణ్ కుమార్ రెడ్డి సతమవుతున్నట్లు భావిస్తున్నారు.
తన వ్యూహాన్ని అమలు చేసేందుకు వైయస్సార్ కాంగ్రెసు, సీమాంధ్ర తెలుగుదేశం సభ్యులను సస్పెండ్ చేయాల్సి వస్తే శాసనసభా వ్యవహారాల మంత్రిగా శైలజానాథ్ అందుకు సంబంధించిన తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలి. వారి సస్పెన్షన్కు తీర్మానం ప్రవేశపెడితే సమైక్యాంధ్ర నినాదం వినిపిస్తున్న శైలజానాథ్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాష్ట్ర విభజనకు అనుకూలంగా వ్యవహరించారనే సంకేతాలు సీమాంధ్ర ప్రజలకు వెళ్తాయి.
ఇదే జరిగితే తమకు నష్టం జరుగుతుందని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. శాఖ మార్పు చేసి ఉండకపోతే శాసనసభా వ్యవహారాల మంత్రిగా శ్రీధర్ బాబు ఉండేవారు. తెలంగాణకు చెందిన శ్రీధర్ బాబు వారి సస్పెన్షన్కు తీర్మానం ప్రవేశపెడితే కిరణ్ కుమార్ రెడ్డికి ఇంతటి తిప్పలు వచ్చి ఉండేది కాదు.
ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యులను, తెలుగుదేశం శాసనసభ్యులను సస్పెండ్ చేయలేకపోవడంతో చర్చకు మరింత గడువు కోరే అవకాశాన్ని కిరణ్ కుమార్ రెడ్డి కోల్పోయారని అంటున్నారు. మొత్తం మీద, శ్రీధర్ బాబు శాఖ మార్పు వల్ల మొదటికే మోసం వచ్చినట్లు చెబుతున్నారు.