జగన్ను భయపెట్టే వ్యక్తి పుట్టలేదు: పవన్ కళ్యాణ్ను ఏకిపారేసిన కొడాలి నాని, మిథున్ రెడ్డి
అమరావతి: జనసేన అదినేత పవన్ కళ్యాణ్పై ఏపీ మంత్రులు, వైసీపీ ప్రజాప్రతినిధులు విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు. రోడ్ల మరమ్మతుల కోసం చేపట్టిన శ్రమదానం కార్యక్రమంపైనా సెటైర్లు వేస్తున్నారు. తాజాగా, చిత్ర పరిశ్రమ వివాదంపై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ అహు అంటే బెదిరిపోయేవాళ్లం కాదు: కొడాలి నాని
ఆటో రజనీ మూవీ ఓపెనింగ్ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ... నలుగురు ప్రొడ్యూసర్లో, నలుగురు హీరోలనో దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోరని చెప్పారు. పవన్ కళ్యాణ్ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందరి ప్రయోజనాల కోసం ఆలోచిస్తుందన్నారు కొడాలి నాని. ఇష్టా రాజ్యంగా టికెట్ల ధరలు పెంచు కోవడాన్ని తామ సమర్థించబోమని కొడాలి నాని తెలిపారు. ఖచ్చితంగా అందరికీ మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటామన్నారు కొడాలి నాని. చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు ఆడాలన్నారు. పవన్ కళ్యాణ్ అహు అంటే.. అదిరి బెదిరి పోయే వాళ్ళము కాదన్నారు.

పవన్ కళ్యాణ్ సినిమా హిట్టైనా.. ఫట్టైనా పోయేదేం లేదు: కొడాలి
పవన్ కళ్యాణ్ సినిమా హిట్టైనా.. ఫెయిలైనా.. ప్రభుత్వానికి వచ్చేది కానీ.. పోయేది కానీ ఉండదన్నారు కొడాలి నాని. సినిమా రంగానికి చెందిన వాళ్లు.. ఎలాంటి సౌకర్యాలు కోరినా.. ప్రభుత్వం తరఫున అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నంలాంటి ప్రాంతాలు మాత్రమే కాదని.. ఎక్కడైనా షూటింగులు చేసుకోవచ్చని.. అందుకు కావాల్సిన సౌకర్యాలు కోరితే.. తగిన సహాయాన్ని అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

జగన్ను భయపెట్టే వ్యక్తి ఇంకా పుట్టలేదంటూ కొడాలి నాని సవాల్
సినిమా టికెట్ల రేట్ల సమస్య.. గతం నుంచీ ఉందని చెప్పిన మంత్రి నాని.. తాము కోర్టు ఆదేశాల ప్రకారమే కమిటీ వేసి నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో నిర్మాతలు న్యాయస్థానానికి వెళ్తే.. కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయని.. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం స్పందించలేదని కొడాలి నాని చెప్పారు.
కాగా, కమిటీ నిర్ణయం వచ్చే వరకూ.. టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని అప్పుడు కోర్టు ఇచ్చిందని.. అది కొందరు అలుసుగా తీసుకుని.. ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుకున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. ఆ పరిస్థితిని మార్చేందుకే.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం కమిటీ వేసి.. నిర్ణయం తీసుకుందన్నారు. పవన్ విమర్శలు, హెచ్చరికలపైనా కొడాలి నాని స్పందించారు. జగన్ ప్రభుత్వానికి ప్రజలు, భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయన్నారు. జగన్ను భయపెట్టే వ్యక్తి ఇంకా పుట్టలేదని కొడాలి వ్యాఖ్యానించారు. జీవిత కాలం టైమ్ ఇస్తున్నానని.. ఎవరూ జగన్ను ఏమీ చేయలేరని సవాల్ చేశారు.

కులాలను రెచ్చగొట్టి రాజకీయాలు: పవన్మిథున్ రెడ్డి ఫైర్
వైసీపీ ఎంపీ మిథన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.పవన్ కళ్యాణ్.. కులాల మధ్య చిచ్చురేపుతున్నారంటూ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'పవన్ కల్యాణ్ కులాల్ని రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఆయనకు కనిపించడం లేదు. సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి మేనిఫెస్టోలోని హామీలను అమలుపరచడం పవన్కు కనిపించడం లేదా? అని మిథున్ రెడ్డి విమర్శించారు.
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుంది. గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు తీవ్ర అన్యాయం చేసింది. గత ప్రభుత్వంలో సోమల, సదుం మండలాల్లో భూముల రికార్డులు టాంపరింగ్, అక్రమాలు జరిగాయి. సీఐడీ విచారణలో అక్రమాలు వెలుగులోకి వస్తాయన్నారు ఎంపీ మిథున్రెడ్డి.












Click it and Unblock the Notifications