గుంటూరుకు కోడెల భౌతికకాయం: రేపు అంత్యక్రియలు: 144వ సెక్షన్..!!
బలవన్మరణానికి పాల్పడిన మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ భౌతిక కాయం గుంటూరుకు తీసుకెళ్తున్నారు. పోస్టుమార్టం అనంతరం హైదరాబాద్ లోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో భౌతిక కాయాన్ని ఉంచారు. పలువురు పార్టీ నేతలు..అభిమానులు కోడెలకు నివాళి అర్పించారు. కోడెల పార్దివ దేహం మీద పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ జెండాను కప్పి నివాళులు అర్పించారు. ఈ ఉదయం ప్రత్యేక వాహనంలో కోడెల భౌతిక కాయాన్ని సూర్యాపేట..విజయవాడ మీదుగా గుంటూరు పార్టీ కార్యాలయానికి తీసుకొస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు కోడెల భౌతిక కాయంతో పాటుగా వస్తున్నారు. మధ్నాహ్నం కొద్ది సేపు పార్టీ కార్యాలయంలో ఉంచిన తరువాత భౌతిక కాయాన్ని నర్సరావుపేటకు తరలిస్తారు. బుధవారం కోడెల స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదే సమయంలో నర్సరావుపేటలో 144 సెక్షన్ విధించారు. పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు.
గుంటూరు కోడెల భౌతికకాయం..
ఆత్మహత్య చేసుకున్న మాజీ స్పీకర్ కోడెల భౌతిక కాయాన్ని టీడీపీ నేతలు గుంటూరుకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం హైదరాబాద్ కార్యాలయంలో ఉంచిన ఆయన పార్దీవ దేహాన్ని పలువురు నేతలు సందర్శించి నివాళి అర్పించారు. హైదరాబాద్ నుండి గుంటూరు కు తీసుకొచ్చే సమయంలో మార్గ మధ్యలో అనేక చోట్ల టీడీపీ నేతలు కోడెలకు నివాళి అర్పించేందుకు ఏర్పాట్లు చేసారు. ఇప్పటికే పార్టీ అధినేత రెండు రోజుల పాటు కోడెలకు సంతాప సభలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదే విధంగా కోడెల భౌతిక కాయంతో పాటుగా చంద్రబాబు సైతం వెంట ఉండి గుంటూరుకు తీసుకెళ్తున్నారు. అక్కడికి చేరుకున్న తరువాత పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రెండు గంటల పాటు కోడెల భౌతిక కాయాన్ని పార్టీ నేతలు..కార్యకర్తల సందర్శనార్ధం ఉంచుతారు. ఆ తరువాత నర్సరావుపేటకు తరలిస్తారు. రాత్రికి అక్కడే ఉంచి స్థానిక ప్రజలకు అవకాశం ఇస్తారు. బుధవారం కోడెల స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. గుంటూరు జిల్లాలో కోడెల అనుచరగణం పెద్ద ఎత్తున ఉండటంతో వారి కోసం గుంటూరు తో పాటుగా నర్సరావు పేటలో అభిమానులు..ఆయన అనుచరులు..ప్రజలకు ఆయనను చివరి సారిగా చూసేందుకు సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

నర్సరావుపేటలో 144 సెక్షన్..
కోడెల మరణంతో నర్సరావుపేటలో ఒక్కసారిగా విషాదం నెలకొని ఉంది. ఆయన అంత్యక్రియల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ అక్కడ ఉండి స్థానిక అధికారులకు సూచనలు చేస్తున్నారు. మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులను సైతం ప్రత్యేకంగా నియమించారు. కోడెల టీడీపీలో కీలక నాయకుడు కావటం..ఆయన మరణం పైన రాజకీయంగా రగడ నెలకొని ఉండటంతో ముందస్తుగా నర్సరావుపేటలో ఎటువంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. నరసరావుపేట పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సున్నితమైన గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు పికెట్లను ఏర్పాటు చేసి 144వ సెక్షన్ విధించామని జిల్లా ఎస్పీ ప్రకటించారు. సామాన్య ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే లక్ష్యంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. తనతో పాటు ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని, గజరావు భూపాల్, పది మంది డీఎస్పీలు, 14 మంది సీఐలు, పెద్ద సంఖ్యలో ప్రత్యేక బలగాలు శాంతి భద్రతల పరిరక్షణలో పాలు పంచుకుంటాయని వివరించారు. అయితే, తమ పార్టీ నాయకుడి అంతిమ యాత్రం సమయంలో 144 సెక్షన్ విధంచటం పైన టీడీపీ నేతలు సీరియస్ అయ్యారు. చివరకు అంతిమ యాత్రను సైతం నిర్వహించుకోనివ్వారి అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే..ముందస్తు చర్యల్లో భాగంగానే నిర్ణయాలు తీసుకుంటున్నామని పోలీసులు స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications