కారులో వెళ్తూ దొంగలను స్వయంగా పట్టుకున్న స్పీకర్ కోడెల
గుంటూరు: ఏపీలోని గుంటూరు జిల్లా ఫిరంగిపురం - నరసరావుపేట మార్గంలో శుక్రవారం ఉదయం భారీ వృక్షాలు నరికేశారు. గుంటూరు నుంచి నరసరావుపేట వెళ్తుండగా ఫిరంగిపురం సమీపంలో చెట్లు నరకడాన్ని గుర్తించిన స్పీకర్ కోడెల శివప్రసాద రావు కారు ఆపి, నరికేస్తున్న వారి పైన మండిపడ్డారు.
అంతేకాదు, వృక్షాలు నరికివేస్తున్న ముఠాను ఆయన స్వయంగా పట్టుకున్నారు. కలప వ్యాపారానికే చెట్లు నరుకుతున్నారని తేలడంతో వారిని ఫిరంగిపురం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. మొక్కలు నాటడమే కాదు, చెట్లను కాపాడడమూ అధికారుల బాధ్యత అని ఈ సందర్భంగా అన్నారు.
ఆర్ అండ్ బీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. కిందిస్థాయి సిబ్బంది, కలప మాఫియా కుమ్మక్కై వృక్షాలను నరికేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కలప వ్యాపారం నిమిత్తం చెట్లను నరకడాన్ని గుర్తించిన కోడెల.. వారికి సరైన శిక్ష పడేలా కేసు పకడ్బంధీగా ఉండాలన్నారు.