జగన్ ఛాంబర్లోకి నీళ్లు: కుట్ర తేలుతుంది, అందరూ చూడొచ్చన్న కోడెల
అసెంబ్లీ భవనంలోని ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఛాంబర్లోకి వర్షపు నీరు చేరడంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ కోడెలా శివప్రసాదరావు స్పందించారు.
అమరావతి: అసెంబ్లీ భవనంలోని ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఛాంబర్లోకి వర్షపు నీరు చేరడంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ కోడెలా శివప్రసాదరావు స్పందించారు. శుక్రవారం, శనివారం ప్రజాప్రతినిధులు, ప్రజలు, ప్రజా సంఘాలు ఎవరైనా అసెంబ్లీ భవనాలను పరిశీలించవచ్చని తెలిపారు.
జగన్ ఛేంబర్లోకి నీళ్లు: కుట్ర కోణంలోని వ్యూహం ఇదీ...
అసెంబ్లీ భవనం ప్రారంభమై నాలుగు నెలలైందని చెప్పారు. గతంలో సమావేశాలు జరిగిన సమయంలోనూ వర్షాలు కురిశాయని.. అప్పుడు జరగని లీకేజీ ఇప్పుడే ఎందుకు జరుగుతుందని కోడెల శివప్రసాదరావు ప్రశ్నించారు.
కుట్రతోనే ఈ ఘటన జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన తెలిపారు. విచారణలో వాస్తవాలు బయటికొస్తాయని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ సభ్యులు ముందుగా అనుమతి తీసుకుంటే మీడియాను కూడా అసెంబ్లీలోకి అనుమతించేవారమని కోడెల శివప్రసాద్ అన్నారు.