మీడియా మెలిక పెట్టింది, అలా చెప్పలేదు: కోడెల
అసెంబ్లీని తాను దేవాలయంగా భావిస్తానని, అలాంటి సభ కొంత గాడి తప్పడం బాధనిపిస్తున్నదని ఆయన అన్నారు. ఎజెండా పూర్తి కాకపోతే ప్రజలు బాధ పడతారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని పక్షాలూ సహకరించాలని, అప్పుడే సభ సజావుగా నడపడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. అయితే, సభా మర్యాదలకు భంగం వాటిల్లితే మాత్రం కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మంగళవారంనాడు శానససభ ఆవరణలోని తన ఛాంబర్లో మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
గత సభ మర్యాదలను, సంప్రదాయాలను పాటించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు ఆయన చెప్పారు. సభా నాయకుడికి మంగళవారం తగినంత సమయం ఇవ్వలేకపోవడం బాధగా ఉన్నదని అన్నారు. సభలో చర్చ జరగకుండా ఏ అంశాన్నీ గత అసెంబ్లీ సమావేశాల్లో గిలిటెన్ చేసేవాళ్లు కాదని ఆయన చెప్పారు. అధికార, ప్రతిపక్షాలు సైతం సమయాన్ని పూర్తిగా వినియోగించుకున్నాయని, ఇప్పుడూ అదే సంప్రదాయంలో సభ జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.
విమర్శలు చేయడానికే కాదు.. నిర్మాణాత్మక సూచనలనూ ప్రతిపక్షం ఇవ్వొచ్చునని సూచించారు. అసెంబ్లీ బయట ఎలా ఉన్నా పార్టీలకతీతంగా సభలో అందరికీ సమ న్యాయం చేస్తున్నానని చెప్పారు. సభ వాయిదా పడ్డాక సభ్యుల మధ్య అవాంఛనీయ ఘటన చోటు చేసుకున్నట్టు తెలిసిందని అన్నారు. సభ్యుల మర్యాద, సౌకర్యాలకు తాను పెద్దపీట వేస్తానని చెప్పుకొచ్చారు. సభా గౌరవం నిలిపే విషయంలో మీడియానూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.