ఆర్ కృష్ణయ్యకు ఎపిలో ఏం పని?: కొల్లు రవీంద్ర మండిపాటు
గుంటూరు/ అమలాపురం: బీసీ సంఘం నాయకుడు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేత కాదని రాష్ట్ర ఎక్సైజ్, బీసీసంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గుంటూరులో శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉద్యోగాల నియామకంపై రాష్ట్రంలో త్వరలో బీసీ యాత్ర నిర్వహిస్తానని ఆర్. కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. విభజన తర్వాత ఏపీ పూర్తిగా వెనుకబడిందని చెప్పారు. ఆదాయం, అప్పులు, ఆస్తుల పంపిణీలో రాష్ట్రానికి తీవ్రఅన్యాయం జరిగిందని అన్నారు.
ఈ ఏడాది ఆదాయం 2.5శాతం పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగాఉన్న సుమారు 25వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో బీసీల సమస్యలు ఉన్నా మెరుగైన జీవనోపాధి కల్పించడం, ఉద్యోగాలు, ఇతర సమస్యలను నేరుగా సీఎంతో ఎవరైనా చర్చించవచ్చన్నారు.
చమురు, సహజవాయువుల సంస్థకు చెందిన కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ లీకేజీల కారణంగా సంభవించే ప్రమాదనివారణలో కీలకంగా వ్యవహరించే డీహైడ్రేషన్ యూ నిట్లను రూ.600 కోట్లతో ఏర్పాటు చేయడానికి ఓఎన్జీసీ అంగీకరించినట్టు అమలాపురం ఎంపీ, ఓఎన్జీసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు పండుల రవీంద్రబాబు వెల్లడించారు.
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో తొమ్మిది యూనిట్లను నెలకొల్పేందుకు ఓఎన్జీసీ నిర్ణయించగా వీటిలో నాలుగింటిని లోక్సభ నియోజకవర్గ పరిధిలో నెలకొల్పడం చరిత్ర అని పేర్కొన్నారు. ఒక్కొక్క డీహైడ్రేషన్ యూనిట్ విలువ రూ.150 కోట్లు ఉంటుందని చెప్పారు.
తడి గ్యాస్ను పొడి గ్యాస్గా మార్చేందుకు ఈ యూనిట్లు ప్రధానంగా ఉపయోగపడతాయన్నారు. ప్రస్తుతం ఎక్కడికక్కడే గ్యాస్ పైపులైన్ల లీకేజీ వల్ల తడి గ్యాస్ గాల్లో కలిసి ప్రమాదాలు ఉత్పన్న మవుతున్నాయి. అటువంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నచోట గ్యాస్ డీహైడ్రేషను యూనిట్ వల్ల ప్రమాదాల నివారణకు అవకాశం ఉంటుందన్నారు.