బాబుకు కొణతాల లేఖ, జగన్కు అది తప్ప తెలియదని గంటా
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సోమవారం నాడు లేఖ రాశారు. గోదావరి జలాలలో ఉత్తరాంధ్రకు న్యాయమైన వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలని ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యధిక వర్షపాతం కురిసినప్పటికీ తాగు, సాగు నీటి కోసం ఇక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఉత్తరాంధ్రలో 16 చిన్న, మధ్య తరహా నదులు ఉన్నాయన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ను పూర్తి చేయాలన్నారు. ఇక్కడి కరవు పరిస్థితులకు చెక్ పెట్టేందుకుగాను నదుల అనుసంధానమే పరిష్కారమన్నారు.
రాజధాని విషయంలో రాజీపడేది లేదు: నారాయణ
రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని మంత్రి నారాయణ అన్నారు. 2018 నాటికి పూర్తి చేసి తీరుతామన్నారు. ఎస్పీఎస్ నెల్లూరులో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో ఆయన మాట్లాడారు. జూన్ నాటికి తాత్కాలిక భవన నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు అన్ని విధాలా న్యాయం చేస్తామన్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ... ఈ నెల 21వ తేదీ నుంచి అమరావతి నుంచే పాలన కొనసాగిస్తామని చెప్పారు. టిడిపికి కార్యకర్తలే బలమని చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కాపులను బీసీలలో చేర్చే సత్తా చంద్రబాబుకే ఉందన్నారు.
జగన్ పైన గంటా నిప్పులు
వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్కు దాచుకోవడం, దోచుకోవడం తప్పా అభివృద్ధి తెలియదని మంత్రి గంటా శ్రీనివాస రావు మండిపడ్డారు. కడపలోని ఓ కన్వెన్షన్ హాలులో టీడీపీ మినీ మహానాడుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి జగన్ అడ్డంకిగా మారారన్నారు. కడప జిల్లాలో టీడీపీకి పూర్వవైభవం తీసుకువస్తామన్నారు.