నిర్మాణదశకు చేరువలో క్షిపణి పరీక్షా కేంద్రం
కృష్ణా జిల్లా నాగాయలంక తీరప్రాంతంలో తలపెట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ క్షిపణి పరీక్షా కేంద్రం ప్రాజెక్ట్ రెండోదశకు చేరుకుంది.
అమరావతి: కృష్ణా జిల్లాలో తలపెట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ క్షిపణి పరీక్షా కేంద్రం ప్రాజెక్ట్ రెండోదశకు చేరుకుంది. తొలి దశ అయిన అటవీ భూముల బదిలీ,పరిహారం చెల్లింపు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. 2012లో నాగాయలంకలోని తీర ప్రాంతంలో తలపెట్టిన ఈ ప్రాజెక్ట్ బాగా ఆలస్యం అవుతుండటంపై కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. అన్ని అడ్డంకులు తొలిగి మూడు నెలల క్రితం తొలి దశకు అనుమతి అభించగా వెంటనే అటవీ భూముల బదిలీ, పరిహారం చెల్లింపు ప్రక్రియ ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశంతో కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం చొరవతో అతి త్వరలోనే మొదటి దశ పనులు ముగింపుకు చేరుకోవడంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మాణానికి చేరువైంది. మొదటి దశ పూర్తయినట్లు కేంద్రానికి తెలియచేసి భూమిని స్వాధీనం చేసిన అనంతరం రెండో దశ అంటే ప్రాజెక్ట్ నిర్మాణానికి అనుమతి లభిస్తుంది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పనులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జరుగుతాయి.నిర్మాణం పూర్తయితే దేశ రక్షణకు సంబంధించి ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకం కానుంది.
రూ. 1200 కోట్ల నిధులతో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ కు కృష్ణా జిల్లాలోని నాగాయలంక తీర ప్రాంతంలో 381.61 ఎకరాల భూములను కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ వలన కృష్ణా జిల్లాతో పాటు, పొరుగునే ఉన్న గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలకు పరోక్షంగా ప్రయోజనాలు చేకూరనున్నాయి. రేపల్లె నియోజకవర్గం పరిధిలోని తీర ప్రాంత మండలాలలో మౌలిక వసతులు మెరుగు అవుతాయి. కృష్ణా జిల్లాతో పాటు, పొరుగునే ఉన్న గుంటూరు జిల్లాలోని ప్రాంతాలకు కూడా పరోక్షంగా ప్రయోజనం చేకూరనుంది. గుంటూరు జిల్లాలోని రేపల్లె, తదితర తీర ప్రాంత మండలాలలో మౌలిక వసతులు మెరుగుకానున్నాయి.
అయితే ఈ ప్రాజెక్ట్ తొలి దశలో భూముల అప్పగింత ప్రక్రియలో భాగంగా కొంత విస్తీర్ణం భూమిని కృష్ణా అభయారణ్యంలో ప్రభుత్వం కలపాల్సి ఉంది. ఇందుకోసం సొర్లగొంది వద్ల స్థలాన్ని కూడా గుర్తించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉన్నందున తొలుత సీసీఎల్లో ఆ తర్వాత మంత్రి వర్గం ఆమోదానికి పంపుతారు. ఇది పూర్తయ్యాక కేంద్ర వన్యప్రాణి బోర్డు అనుమతులు లభిస్తాయి. దీంతో ప్రాజెక్ట్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయినట్లే. ఈ మొత్తం ప్రక్రియ అంతా నెలలోపే పూర్తి చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. రహదారుల అనుసంధానంపై దృష్టి ఈ ప్రాజెక్ట్ కొరకు క్షిపణి విడిభాగాలను తీసుకురానున్నందున,వీటిని భారీ వాహనాలలో తరలించాల్సి ఉన్నందున ప్రత్యేక రోడ్ల నిర్మాణం, రోడ్ల అనుసంధానం చాలా కీలకం కానుంది. అందువల్ల ఈ బాధ్యతను డీఆర్డీవో తీసుకోనుంది.