బచావత్ గీటురాయి: ఎపి, టీ ప్రభుత్వాలకు బోర్డు
హైదరాబాద్: ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్ నిర్ణయించినట్లు నీటిని వినియోగించుకోవచ్చని తీర్మానించింది. మీ ప్రాజెక్టులు - మీకు ఇష్టం వచ్చినట్లు నిర్మించుకోవచ్చునని, అంతర్గతంగా నీటిని కేటాయించుకోవచ్చునని కృష్ణా యాజమాన్యం అంతర్గత బోర్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సూచించింది. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చూసుకుని, ఆ నీటిని రెండు రాష్ట్రాలూ తమ తమ అంతర్గత అవసరాలకు వాటి ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చని కూడా తీర్మానించింది.
కృష్ణా నది యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా అధ్యక్షతన అంతర్గత కమిటీ సోమవారం సీడబ్ల్యూసీ కార్యాలయంలో సమావేశమైంది. దీనికి ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్, ఇంజనీర్-ఇన్-చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు, ఇతర చీఫ్ ఇంజనీర్లు, తెలంగాణ ఇంజనీర్-ఇన్-చీఫ్ సి.మురళీధర్ తదితరులు హాజరయ్యారు.
కృష్ణా జలాల వినియోగంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు చేసిందని, రాష్ట్ర విభజన తర్వాత ఏ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉందనే విషయం సుస్పష్టంగా ఉందని, అందువల్ల బచావత్ కేటాయింపుల ప్రకారమే కృష్ణా నీటిని వాడుకోవాలని కమిటీ తీర్మానించింది. శ్రీశైలం రిజర్వాయర్కు ఇప్పటి వరకు 125 టీఎంసీల నీరు అదనంగా వచ్చి చేరిందని, ఆ నీటిని ఆయా ప్రాజెక్టులకు చేసిన కేటాయింపుల ప్రకారం వాడుకోవచ్చని కమిటీ నిర్ణయించింది.

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్ఆర్బీసీ, తెలుగు గంగకు నీటిని విడుదల చేయడమనేది ఆంధ్రప్రదేశ్ అంతర్గత వ్యవహారమని కమిటీ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్కి ఉన్న కేటాయింపుల ప్రకారం ఆ నీటిని ఎలాగైనా వాడుకునే స్వేచ్ఛ ఏపీకి ఉంటుందని, అలాగే, తెలంగాణలోని ప్రాజెక్టులకు కేటాయించిన నీటిని ఎలాగైనా వాడుకునే స్వేచ్ఛ తెలంగాణ ప్రభుత్వానికి ఉందని కమిటీ తీర్మానించింది.
కృష్ణా నది యాజమాన్య బోర్డు పరిధిని సోమవారంనాటి సమావేశంలో ఖరారు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు చేసిన సూచనలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర జల వనరుల శాఖ ముసాయిదా పరిధి, అధికారాలను తయారు చేసి పంపించింది. ఆ వివరాలను బోర్డు సభ్య కార్యదర్శి కమిటీ సమావేశంలో వెల్లడించారు.
జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల ప్రధాన డ్యాం గేట్లు, ఆ ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేసే అన్ని రకాల ప్రధాన కాల్వల హెడ్ రెగ్యులేటర్లు పూర్తిగా బోర్డు నియంత్రణలో పని చేస్తాయి. జూరాల ప్రధాన గేట్లు, జల విద్యుదుత్పత్తి కేంద్రాలు, జూరాల కుడి, ఎడమ కాల్వలు, జూరాల ఆధారంగా నిర్మిస్తున్న నెట్టెంపాడు ఎత్తిపోతల, శ్రీశైలం ప్రధాన డ్యాం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, వెలిగొండ, ఎస్ఎల్బీసీ సొరంగాల గేట్లు, కుడి, ఎడమ జల విద్యుదుత్పత్తి కేంద్రా లు, నాగార్జున సాగర్ ప్రధాన డ్యాం గేట్లు, ప్రధాన జల విద్యుదుత్పత్తి కేంద్రం, ఎడమ, కుడి ప్రధాన కాల్వల గేట్లు, జల విద్యుదుత్పత్తి కేంద్రాలన్నీ పూర్తిగా బోర్డు నియంత్రణలో ఉంటాయి.
సాగర్ ఎడమ కాల్వ మొత్తం కూడా బోర్డు పరిధిలోనే ఉంటుంది. దానిద్వారా కృష్ణా జిల్లాకు చేరాల్సిన నీటి విషయంలో పూర్తి బాధ్యత బోర్డుదే. సుంకేశుల, నాగార్జున సాగర్ టెయిల్పాండ్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు నీటి విడుదల అంశాల్లో బోర్డు పరిశీలనలో ఉంటాయి. వీటిపై నియంత్రణ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది.












Click it and Unblock the Notifications