కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలు...జగన్ మళ్లీ తప్పులో కాలేశారా?....మరో ట్విస్ట్ ఉందా?..
Recommended Video

కర్నూలు: కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి వైసిపి తప్పుకోవడంపై పెనుదూమారం రేగుతోంది. జగన్ మరోసారి తప్పులో కాలేసాడని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదే అభిప్రాయం వైసిపి లోని సీనియర్ నేతలు ఆఫ్ ద రికార్డ్ గా అంటున్నారట. మరోవైపు టిడిపితో సహా మిగతా రాజకీయ పార్టీలన్నీ జగన్ నిర్ణయాన్నిఎద్దేవా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసిపి మరో ట్విస్ట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు.
కర్నూలు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కెఈ కృష్ణమూర్తిని టిడిపి ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కర్నూలు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలనుంచి వైదొలగినట్లు వైసీపీ ప్రకటన ఆ పార్టీ నేతలకే కాదు రాజకీయ పార్టీలన్నిటిని షాక్ కు గురిచేసింది. విలువలకు కట్టుబడి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ స్థానంలో అవే విలువలను నిలబెట్టేలా వ్యవహరించాలి తప్ప అసలు ప్రజాస్వామ్య స్ఫూర్తినే దెబ్బతీసే విధంగా నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
పోనీ తామే ఆరోపించినట్లు టిడిపి అవినీతి సొమ్ముతో ఈ ఎన్నికలను గెలిచేందుకు సిద్దమైందని, అందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నాం అంటే దాని అర్థం ఏంటి? టిడిపి డబ్బు రాజకీయం ముందు మేము నిలబడలేకపోతున్నామని ఒప్పుకున్నట్లే కదా అనే ప్రశ్న అన్నివైపుల నుంచి ఉత్పన్నమవుతోంది. అంతేకాకుండా రాజకీయ పరంగా చూసినపుడు తాము ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆ ప్రభావం తమ పార్టీ మీద పడుతుందని, తద్వారా పార్టీ మరింత బలహీనపడుతుందనే భయంతో ఈ నిర్ణయం తీసుకున్నాఅది కూడా సరికాదంటున్నారు.

ఎందుకు సరి కాదంటే...
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ కారణం చేతనైనా తాము పోటీ చెయ్యలేకపోతున్నామని చెప్పడం అంటే ఓటమిని అంగీకరించినట్లే. అలా పోరాడకుండానే ఓటమిని అంగీకరించడం అంటే ప్రజల్లోకి చేజేతులా పార్టీ బలహీనత గురించి సిగ్నల్స్ పంపించడమే. చంద్రబాబు మేనేజ్మెంట్ కెపాసిటీని తాము తట్టుకోలేకపోతున్నామనే అభిప్రాయాన్నిజనానికి కల్పించడమే. ప్రజాస్వామ్య నైతిక విలువల స్ఫూర్తి కోసమంటూ శిల్పా చక్రపాణిరెడ్డితో రాజీనామా చేయించి, అంతకంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రాణాధారం అయిన గెలుపోటములతో నిమిత్తం లేకుండా పోటీచెయ్యడం అనే ముఖ్యమైన విషయాన్ని జగన్ ఎలా విస్మరించాడు అనే ప్రశ్న తలెత్తుతోంది.

అదే పాయింట్...
మాకు బలం ఉన్నా కానీ మేము పోటీ చెయ్యడం లేదు అని వైసిపి చెప్పడం మరో అతి పెద్ద తప్పిదమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మీకు బలం ఉన్నప్పుడు తప్పనిసరిగా పోటీ చేసి తీరాలి...ఒకవేళ టిడిపి మీరు చెప్పినట్లే అనైతిక అక్రమ పద్దతులకు పాల్పడితే అవి జనం మరోసారి గమనించే అవకాశం వస్తుంది కదా...అలా ప్రజలకు ఆ విషయమై అవగాహన కల్పించేపని ప్రతిపక్షంగా ఉండి చెయ్యాలికదా మరెందుకు పలాయనం చిత్తగిస్తున్నారనే ప్రశ్న కు జవాబివ్వాల్సి ఉంటుంది.

ఎమ్మెల్సీనే గెలిపించలేనివాడు...
ఈ ఎన్నికల్లో పోటీచెయ్యకుంటే జగన్ మీద టిడిపి మరిన్ని విమర్శనాస్త్రాలు సంధించి నైతికంగా మరింత దెబ్బతీసే అవకాశం ఉందట. ఒక్క ఎమ్మెల్సీకే పోటీ పడలేనివాడు, పోటీ చెయ్యలేనివాడు రేపు సార్వత్రిక ఎన్నికల్లో ఏం చేస్తాడు...అతనిది మునిగిపోయే ఓడ అని టిడిపి ప్రచారం చేస్తుందట. దీంతో జగన్ కూడా ఆ విమర్శలను తిప్పికొట్టలేని పరిస్థితి తెచ్చుకుంటాడని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఆ విషయం వేరు...
అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చెయ్యడం వేరు...ఫిరాయింపుదార్ల పై చర్యలు లేవనే విషయాన్ని చర్చకు తేవాలనే వ్యూహంతో చేశారనుకున్నా దానివల్ల మిశ్రమ స్పందన వ్యక్తమైంది. అయితే ఇలా ఎన్నికల్లో పోటీ పడలేకపోవడం అంటే అటు పార్టీలోను, ఇటు జనాల్లోనూ తనంతట తానే తన అశక్తతని బైటపెట్టుకున్నట్లే అని విశ్లేషిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ కారణాల వల్ల జగన్ పోటీ నుంచి వెనక్కి వెళ్లాడనే సానుభూతి ఉండనే ఉండదు. చంద్రబాబు ఎలక్షన్ మేనేజ్మెంట్ ధాటికి జగన్ భయపడ్డాడనే అభిప్రాయమే ఏర్పడే అవకాశం ఉంటుంది. వచ్చే ఎన్నికల్లోను చంద్రబాబు వేల కోట్ల రూపాయలతో ఎలక్షన్ కు సిద్దపడితే అప్పుడు కూడా జగన్ ఇలాగే పోటీ చెయ్యకుండా వదిలేస్తాడా అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పే పరిస్థితి ఉండదంటున్నారు.

సలహా ఎవరిచ్చారు?
జగన్ నిర్ణయం తీసుకునే విషయంలో ఎవరు చెప్పినా వినరనే అభిప్రాయం బలంగా ఉంది. మరి ఈ నిర్ణయం జగనే తీసుకున్నారా? లేక ప్రశాంత్ కిషోర్ సలహానా ? ఒకవేళ ప్రశాంత్ కిషోర్ సలహా అయితే అతడు ఆంధ్రా పాలిటిక్స్ ని సరిగ్గా అంచనా వెయ్యలేకపోతున్నాడనే అర్థం చేసుకోవాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. జగన్ నిర్ణయమైతే అతడు ఆత్మరక్షణ ధోరణిలో పడినట్లేనని, అది ఈ పరిస్థితుల్లో మరింత ప్రమాదకరమని విశ్లేషిస్తున్నారు. ఏ రకంగా చూసుకున్నా గెలుపో? ఓటమో? పోటీ చెయ్యడమే బెటరని, అసలు వైసిపి చెబుతున్న కారణంతో ఎన్నికలకు వెళ్లకుండా ఉండటం ఆత్మహత్యా సదృశ్యం అని అంటున్నారు.

మరో ట్విస్ట్ ఉంటుందా?...
ఈ నేపథ్యంలో జగన్ మళ్లీ కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై పునరాలోచిస్తారా? ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ కు అవకాశం ఉందా? అంటే సాధారణంగా అయితే జగన్ ఒకసారి తన నిర్ణయం ప్రకటించాక వెనక్కి తీసుకోడనే సంగతి అందరికి తెలిసిందే. అయితే జగన్ అనుమతి తోనే తాను రేపు నామినేషన్ వేయబోతున్నానని గౌరు వెంకటరెడ్డి సోమవారం తన మద్దతుదారులతో, కొంతమంది విలేకరులతో కూడా అన్నట్లు ప్రచారం జరుగుతోంది. నేను పోటీలో ఉంటున్నాను రేపు జగన్ ను కలిసేందుకు అనంతపురం వెళుతున్నానని వెంకటరెడ్డి చెప్పాడంటున్నారు. కాబట్టి ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంటుందేమో కొద్ది గంటలు వేచిచూస్తే తేలిపోతుంది. మంగళవారంతో నామినేషన్ల గడువు పూర్తవుతుండటంతో ఈ విషయమై స్పష్టత రావడం ఖాయం.












Click it and Unblock the Notifications