భూమా చేరికపై కెఈ, శిల్పా వ్యతిరేకత: టిడిపిలోనే కొనసాగుతారని వైవీ
హైదరాబాద్: నంద్యాల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిలప్రియను పార్టీలో చేర్చుకోవాలనే ఆలోచనను కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి భూమాను చేర్చుకోవాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.
వారిద్దరు నేరుగా తమ వ్యతిరేకతను మాత్రం వ్యక్తం చేయలేదు. కర్నూలు జిల్లాలో టిడిపి బలంగానే ఉందని కెఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. కాగా, భూమా చేరికపై తమకు సమాచారం లేదని శిల్పా చక్రపాణి రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితోనే తమ అభిప్రాయాన్ని నేరుగా చెబుతామని ఆయన అన్నారు. భూమా చేరికపై తమకు సమాచారం లేదని కెఈ కూడా అన్నారు.
ఇదిలావుంటే, భూమా నాగిరెడ్డి తమ పార్టీలో కొనసాగుతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయి రెడ్డి చెప్పారు. భూమా నాగిరెడ్డితో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత వారు శనివారం మీడియాతో మాట్లాడారు. మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ గందరగోళం సృష్టిస్తోందని వారన్నారు.
భూమాతోపాటు ఆయన అనుచరులు కూడా వైసీపీలోనే ఉంటారనీ, ఈ విషయంలో తమకు క్లారిటీ ఉందన్నారు. మీడియాకే ఇంకా ఎందుకు క్లారిటీ రావట్లేదో అర్థమవడం లేదన్నారు. లేనిపోని వార్తలు ప్రసారం చేసుకుంటూ తమ పార్టీ నేతల్లో మనోస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోందన్నారు.
టిడిపి ప్రభుత్వం చేస్తోన్న అన్యాయాలపై నిరంతరం పోరాటం చేస్తామని, ఈ పోరాటంలో భూమా ముందుంటారని వైవీ ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో పార్టీని ఎవరూ వీడటంలేదనీ, టీడీపీనే రానురానూ బలహీనపడుతోందన్నారు. జిల్లా రాజకీయాలపైనే జగన్తో సమావేశమయ్యామనీ, భూమా విషయం జగన్ వద్ద చర్చకు రాలేదన్నారు.
కాగా, పార్టీ మారే విషయంపై భూమా నాగిరెడ్డి ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. తనతో ముగ్గురు వైసిపి నాయకులు మాట్లాడిన తర్వాత కూడా ఆయన మీడియా ముందుకు రాలేదు.
తాము రాష్ట్రం కోసం చేస్తున్న అభివృద్ధిని చూసే అవతలి పార్టీ శాసనసభ్యులు తమ పార్టీలోకి వస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాగా, తాము వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతామని ఎస్వీ మోహన్ రెడ్డితో పాటు మణిగాంధీ స్పష్టం చేశారు. వారు టిడిపిలో చేరుతున్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో వారు మీడియాతో మాట్లాడారు.
గౌరు సుచరితా రెడ్డి కూడా తాను పార్టీ మారడం లేదని చెప్పారు. జగన్తో సమావేశమైన ఐదుగురు కర్నూలు జిల్లా శాసనసభ్యులు ఎస్వీ మోహన్ రెడ్డి, గౌరు సుచిరత, జయరాములు, బుడ్డా రాజశేఖర రెడ్డి, ఐజయ్య తాము పార్టీ మారడం లేదని స్పష్టం చేసారు. తాను టిడిపిలోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలను కొడుమూరు శాసనసభ్యుడు మణిగాంధీ కర్నూలు జిల్లాలో స్పష్టం చేశారు.