చిరు కష్టం వల్లే: కెవిపి కితాబు, అక్కడే పవన్పై జెడి ఫైర్
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ చీఫ్ చిరంజీవిను కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావు ప్రశంసల్లో ముంచెత్తారు. శభాష్ .. బాగా కష్టపడ్డారని, వారం రోజులపాటు బస్సు యాత్రలో నిరాటంకంగా తిరిగారని, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారని చిరంజీవికి కెవిపి కితాబిచ్చారు.
ఇందిరాభవన్లో జరిగిన జిల్లా కాంగ్రెసు కమిటీ అధ్యక్షుల సమావేశానికి చిరంజీవి, కెవిపి రామచంద్ర రావు, రఘువీరా రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కెవిపి మాట్లాడుతూ బస్సుయాత్ర విజయవంతమైందని.. ఇందుకు చిరంజీవి పడిన కష్టమే కారణమన్నారు.
అదే సమయంలో... సమావేశం అనంతరం కేంద్ర మంత్రి జెడి శీలం పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. బడుగులతో కాంగ్రెస్ది పేగుబంధమని, ఈ బంధాన్ని తెగ్గొట్టేందుకు కొందరు కత్తెరలు పట్టుకుని తిరుగుతున్నారని, కాంగ్రెస్ను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని జెడి శీలం మండిపడ్డారు.
కాంగ్రెస్ బలహీనపడితే దళితులు బలహీనపడినట్లేనన్నారు. మోడీ కిరాతకుడు, నరరూప రాక్షసుడని, మోడీపై మోజుతోనే రాకీ సావంత్, పవన్ కళ్యాణ్లాంటి నటులు పార్టీ పెడుతున్నారన్నారు. రాకీ, పవన్ ఎవరు పార్టీ పెట్టినా తమకు ఏమీ కాదని ఆయన అన్నారు.