బుడమేరుకు మళ్లీ వరద ముంపు - బెజవాడలో తాజా అలర్ట్స్..!!
బుడమేరు మరోసారి టెన్షన్ పెడుతోంది. విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరులో నీటి ప్రవాహం పెరుగుతోంది. ఏ క్షణమైనా బుడమేరులో వరద ప్రమాదం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేసారు. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో, విజయవాడలోని ఏడు ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు. గత వారం వరదల నుంచే పూర్తిగా కోలుకోకముందే తాజా హెచ్చరిక లతో మరోసారి ఆందోళన కనిపిస్తోంది.
పెరుగుతున్న ప్రవాహం
బుడమేరుకు ఏ క్షణమైనా వరద వచ్చే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అప్రమత్తం చేసారు. బుడమేరు పరీవాహక ప్రాంతంలో నిరంతరంగా మరియు భారీ వర్షాలు కురుస్తుండటంతో మరియు భారీ వర్షపాతం గురించి అంచనా వేసినందున, బుడమేరు నదికి ఎప్పుడైనా భారీ మరియు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం, వెలగలేరు రెగ్యులేటర్ 2.7 అడుగుల వద్ద ఉంది. ఇది బుడమేరు కోర్సుకు డిశ్చార్జిని విడుదల చేయడానికి..ఉన్నత అధికారుల సూచనల మేరకు..ఇది 7 అడుగులకు చేరుకున్నప్పుడు నిర్వహించాల్సి ఉంటుందని వెల్లడించారు.

వరద ముప్పు
వరద దిగువకు విడుదల కావడం వల్ల బుడమేరు పక్కన ఎలప్రోలు, రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి కాలనీ, సింగ్ నగర్, గుణదల, ఎన్టీఆర్ జిల్లా రామవరప్పాడు తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. కావున, వరద ప్రభావిత ప్రాంతాలను తక్షణమే తరలించి, అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని, సంబంధిత అధికారులు మరియు ప్రజలందరినీ అప్రమత్తం చేయాలని అభ్యర్థించారు. విజయవాడలో ఇంకా అనేక కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి.
అధికారుల అలర్ట్
ఇదే సమయంలో తుపాను ప్రభావంతో ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదికి మళ్లీ వరద ఉద్ధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 13 అడుగులకు నీటిమట్టం చేరింది. మొత్తం 70 గేట్ల ద్వారా 4 లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఇప్పుడిప్పుడే విజయవాడను ముంపు వీడుతున్న నేపథ్యంలో కృష్ణమ్మకు పేరుగుతున్న వరద ప్రవాహం నగర వాసుల్లో ఆందోళనను కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications