పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్: బాబుపై 'వ్యూహం' బెడిసికొట్టడంతో జగన్వైపు అడుగులు వేస్తున్నారా?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన, వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య టీఆర్ఎస్ పొత్తు కోసం ప్రయత్నాలు చేసిందా? ఆ ప్రయత్నాలు విఫలమయ్యాకే టీఆర్ఎస్ వైసీపీ వైపు మొగ్గు చూపిందా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాహాటంగానే తమతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, వైసీపీ నేతలు టీఆర్ఎస్ నేతల ద్వారా ప్రయత్నాలు చేశారని ఇటీవల పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇది కలకలం రేపింది. అయితే, చంద్రబాబును ఓడించాలని కంకణం కట్టుకున్న కేసీఆర్ వీరిద్దరి కలయికకు ఆసక్తి చూపించి ఉంటారని అంటున్నారు.

జగన్కు అనుకూలంగా టీఆర్ఎస్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వేలుపెట్టారని, కాబట్టి తాము కూడా ఏపీ ఎన్నికల్లో వేలు పెడతామని కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు పదేపదే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతారని టీఆర్ఎస్ నేతలు జోస్యం చెబుతున్నారు. కానీ బహిరంగంగా జగన్ లేదా పవన్ కళ్యాణ్లలో ఎవరికీ ఫేవర్గా మాట్లాడటం లేదు. కానీ టీఆర్ఎస్ తీరు జగన్కు అనుకూలంగా ఉందనే వాదనలు ఉన్నాయి.

అదే లక్ష్యంతో జగన్-పవన్ను కలిపేందుకు ప్రయత్నాలు
తెలుగుదేశం పార్టీ ఓటమే టీఆర్ఎస్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏపీ అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో చంద్రబాబును దెబ్బతీయడం కోసం జగన్, పవన్ కళ్యాణ్లు కలవాలని వారు కోరుకున్నారని, అందులో భాగంగా వారిని కలిపేందుకు ప్రయత్నాలు చేసి ఉంటారని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ కంటే వైసీపీ మెరుగు, అందుకే జగన్ వైపు అడుగులు
జగన్తో దోస్తీ కుదిర్చేందుకు వారి ప్రయత్నాలు బెడిసికొట్టడంతో టీఆర్ఎస్ నేతలు క్రమంగా జగన్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న జనసేన కంటే వైసీపీ వైపే ఏపీలో మొగ్గు ఉంటుందని గ్రహించిన టీఆర్ఎస్... చంద్రబాబును ఓడించేందుకు జగన్ వైపే అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఓ విధంగా పవన్ కళ్యాణ్కు బలం, ఫ్యాన్స్ ఉన్నప్పటికీ రాజకీయం వేరు అని, ఆ పార్టీకి కేడర్ అంతగా లేదని, ఈ కారణంగానే కేడర్ ఉన్న వైసీపీ వైపు చూస్తుండవచ్చునని అంటున్నారు.

బెడిసి కొట్టడంతో జగన్ వైపు
మొత్తంగా జగన్-పవన్ కళ్యాణ్ను కలిపేందుకు టీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు... జనసేనాని నో చెప్పడం వల్ల బెడిసికొట్టి ఉంటాయని, అందుకే వారు వైసీపీ వైపు చూస్తుండవచ్చునని కూడా అంటున్నారు. పొత్తు కోసం పవన్ నో చెప్పడంతో ఏం చేయలేక జగన్ వైపు మరలతున్నారని భావిస్తున్నారు. తమతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనలను వైసీపీ నేతలు కొట్టి పారేయడం వేరే విషయం.

పవన్ కళ్యాణ్ పట్ల మెతక వైఖరి
ఇదిలా ఉండగా, టీఆర్ఎస్ నేతలు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి నేరుగా మద్దతివ్వడం లేదా ప్రచారం చేసే అవకాశాలు లేకపోవచ్చునని అంటున్నారు. కేసీఆర్ వస్తే అదే అస్త్రంతో టీడీపీ నేతలు జగన్ను ఇరకాటంలో పడేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పరోక్షంగా మాత్రమే మద్దతు ఉండవచ్చునని అంటున్నారు. అదే సమయంలో టీఆర్ఎస్తో పాటు టీడీపీ, వైసీపీలు కూడా పవన్ కళ్యాణ్ పట్ల మెతక వైఖరితో ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చునని, అవసరమైతే దోస్తీ కుదుర్చుకునే పరిస్థితి రావొచ్చునని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్తో పొత్తు కోసం బహిరంగంగానే ప్రకటన చేసిన చంద్రబాబు, ఆయన నో చెప్పడంతో ఇటీవల తమ పార్టీ నేతలకు మాత్రం జనసేనానిని ఏమీ అనవద్దని ఆదేశాలు జారీచేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందోననే ఉద్దేశ్యంతోనే అలా ఆదేశించి ఉంటారని అంటున్నారు.












Click it and Unblock the Notifications