TTDపై లాక్డౌన్ ఎఫెక్ట్ : వెంకన్న సిబ్బందికి జీతాల కటకట.. అవి ముట్టుకోలేరు..ఇక్కడ ఆదాయం లేదు..!
తిరుపతి: కరోనావైరస్ కారణంగా దేశం మొత్తం లాక్డౌన్ లోకి వెళ్లిపోయింది. ఏ రంగం చూసినా నష్టాలే. లాక్డౌన్ కారణంగా ఆయా రాష్ట్రాలు ఆర్థికంగా కృంగిపోవడంతో చివరకు ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇచ్చే వేతనాల్లో కూడా కోత విధించాయి. ఇక ఆపదమొక్కులు తీర్చే తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పనిచేసే ఉద్యోగస్తులకు కూడా వేతనాల ఇబ్బంది తలెత్తుతోంది.
కరోనా లాక్ డౌన్ దెబ్బకు అప్పుల్లో తెలంగాణా: కేంద్రం ఆదుకోకుంటే కష్టమే !!
టీటీడీపై లాక్డౌన్ ఎఫెక్ట్
కరోనావైరస్ కారణంగా దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోవడంతో ఎంతో మంది జీవితాలు ఇబ్బందుల్లోకి నెట్టివేయబడ్డాయి. ప్రస్తుతం దేశం మూడోసారి లాక్డౌన్లోకి వెళ్లిపోవడంతో ఆర్థికంగా రాష్ట్రాలు కుదేలయ్యాయి. అయితే ఆర్థికంగా కాస్త నిలదొక్కుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు సైతం ఇచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు తగ్గించి ఇవ్వడం లేదా కోతలు విధించడం వంటివి జరిగాయి. తాజాగా తిరుమలలో ఏడుకొండల వాడి ఆలయంలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి తలెత్తింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిగణించబడుతోంది. అయితే అందరి ఆపదలు తీర్చే తిరుమల వెంకన్న తన ఆలయంలో పనిచేసే ఉద్యోగస్తులను మాత్రం ఆదుకుంటాడా లేదా అనే చర్చ జరుగుతోంది.
లాక్డౌన్ కారణంగా రూ.400 కోట్లు నష్టం
ఇక లాక్డౌన్ కారణంగా భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేయడం, కార్యకలాపాలు నిలిచిపోవడంతో భారీ నష్టాన్ని టీటీడీ ట్రస్టు చవిచూసింది. దాదాపుగా రూ.400 కోట్లు మేరా రెవిన్యూ నష్టపోయింది. అయితే ఇప్పటికే వేతనాలు, పెన్షన్లు, ఇతర కార్యక్రమాలపై టీటీడీ రూ.300 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. లాక్ డౌన్ సమయంలోనే ఇదంతా ఖర్చు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. మరోవైపు ఈ గండం నుంచి గట్టెక్కేందుకు కూడా ఖర్చు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఇక ఈ నష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు అధికారులు చెప్పారు. అయితే టీటీడీ పేరుదో ఎనిమిది టన్నులు బంగారం నిల్వ ఉంది. అదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో రూ.14వేల కోట్లు ఉన్నాయి. వీటిని ముట్టకుండానే సమస్యకు పరిష్కారం కనుగొంటామని అధికారులు చెబుతున్నారు.
వేతనాలు చెల్లిస్తామంటున్న ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి
ఇదిలా ఉంటే కరోనావైరస్ కారణంగా భక్తుల శ్రేయస్సును కోరి ఆలయంను మూసివేయడం జరిగింది. ఆలయం మూసివేసి దాదాపుగా 50 రోజులు గడుస్తోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులకు ఆలయ ద్వారాలు ఎప్పుడు తెరుచుకుంటాయో ఇప్పుడప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఉద్యోగస్తుల వేతనాలు, పెన్షన్లు ఇతర ఖర్చులను చెల్లిస్తామని చెబుతున్నారు టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి. లాక్డౌన్ కారణంగా రెవిన్యూ భారీగా తగ్గినప్పటికీ ఉద్యోగస్తులకు సిబ్బంది జీతాలు చెల్లిస్తామని ఆయన చెప్పారు. ఏటా రూ.2500 కోట్లు ఇందుకు కేటాయిస్తామని వెల్లడించారు. నెలకు సగటున రూ.200 నుంచి రూ.220 కోట్లు ఆదాయం వస్తుందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అయితే లాక్డౌన్ కారణంగా ఆలయ ద్వారాలు మూసివేయడంతో ప్రస్తుతం రెవిన్యూ లేదని స్పష్టం చేశారు.
Recommended Video
లాక్డౌన్తో అంతా నష్టమే..
లాక్డౌన్ లేకుంటే సాధారణంగా రోజుకు 80వేల నుంచి లక్ష వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారని చెప్పిన అధికారులు... పండగ వేళల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. భక్తుల దర్శనం నిలిపివేసినప్పటికీ స్వామివారికి జరగాల్సిన రోజూవారి కార్యక్రమాలు ఆగమనాల ప్రకారం నిర్వహిస్తున్నామని చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,309.89 కోట్లు వార్షిక బడ్జెట్ను ఆమోదించిందని గుర్తుచేశారు. అయితే ఈ ఏడాది మార్చి నుంచి దేవుని హుండీలో భారీగా కానుకలు తగ్గాయని స్పష్టం చేశారు. మార్చి 20 నుంచి రూ.150 కోట్ల నుంచి రూ.175 కోట్లు నష్టం వాటిల్లిందని వెల్లడించారు. ఇక ప్రత్యేక దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, ప్రసాదంలపై వచ్చే రెవిన్యూ కూడా భారీగా తగ్గిందని వెల్లడించారు. వేతనాలు ఇతర అలవెన్సుల కోసం 2020-21కుగాను మొత్తం 1385.09 కోట్లు కానుండగా నెలకు రూ.120 కోట్లు టీటీడీ విడుదల చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో టీటీడీ ఆధ్వర్యంలో నడిచే స్విమ్స్కు బీఐఆర్ఆర్డీ ఇతర హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్కు గ్రాంట్స్ రూపంలో రూ.400 కోట్లు విడుదల చేసి ఆర్థికంగా ఆదుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ లాక్డౌన్ కారణంగా టీటీడీకి భారంగా మారనున్నాయి.