జనసేన కార్యాలయానికి లోకేష్ - కలిసి పని చేద్దామంటూ : జగన్ లక్ష్యంగా- పక్కా వ్యూహంతో..!!
ఏపీ రాజకీయాల్లో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నారేళ్లు పూర్తయింది. మరో రెండున్నారేళ్ల అధికారం ఉంది. అయితే, 2024 ఎన్నికల కోసం అధికార పార్టీ ముందుగానే కసరత్తు ప్రారంభించింది. ఇందు కోసం సర్వే సంస్థలను రంగంలోకి దించుతోంది. దీంతో..వచ్చే ఎన్నికల్లో టీడీపీ - వైసీపీకి గెలుపు రాజకీయంగా జీవన్మరణ సమస్యగా మారుతోంది. అదే సమయం లో జగన్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు మరలా 2014 పొత్తులను రిపీట్ చేయాలనే ఉద్దేశం టీడీపీలో కనిపిస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. రెండు పార్టీలు వైసీపీ టార్గెట్ గా పని చేస్తున్నాయి.

రెండు పార్టీల మధ్య బంధానికి తొలి అడుగు
బీజేపీ తో జనసేన పొత్తు కొనసాగుతున్నా... ఆ పార్టీ నేతలు - కార్యకర్తలు మాత్రం బీజేపీ కంటే టీడీపీతో పొత్తు రాజకీయంగా మేలు చేస్తుందనే అభిప్రాయంతో ఉన్నారు. కొద్ది నెలల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ పలు ప్రాంతాల్లో టీడీపీ - జనసేన మధ్య అనధికారిక పొత్తులతో సీట్లు దక్కించుకున్నారు. ఇక, ఇప్పుడు తాజాగా టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ జనసేన కార్యాలయానికి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మంగళగిరిలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఇప్పటి నుంచే లోకేష్ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు.

కింది స్థాయిలో నేతల్లో పొత్తుపై బలంగా
అందులో భాగంగా.. పార్టీ శ్రేణులతో కలిసి కుంచనపల్లిలో పర్యటించారు. ఆ సమయంలో అనూహ్యంగా జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడ జనసేన కార్యకర్తలను పలకరించారు. కుంచన పల్లిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, పార్టీ విషయాలను జనసేన నేతలు, కార్యకర్తలతో నారా లోకేష్ చర్చించినట్లు తెలుస్తోంది. అప్పటికే అక్కడకు వచ్చిన జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షుడు శివనాగేంద్ర రావు ఎదురయి ఆయనకు నమస్కారం చేశారు. నవ్వుతూ... మనం ముందుముందు కలిసి పని చేయాలి అని లోకేష్ ప్రతిపాదించారు.

లోకేష్ అడుగులు..భవిష్యత్ సూచికలుగా
అయితే కలిసి పని చేయటం అనేది అధిష్టానం స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయమని, తమ అధిష్టానం ఏం చెబితే అది చేస్తామని శివనాగేంద్రరావు బదులివ్వటంతో... లోకేష్ ముసిముసి నవ్వులు నవ్వారు. మెట్లు దిగుతూ అక్కడున్న జనసేన కార్యకర్తలతో కరచాలనాలు చేశారు. కలిసి పనిచేద్దామని లోకేష్ ప్రతిపాదించినట్లు లోకేష్ వెళ్లిపోయిన అనంతరం జనసేన నాయకుడు ధ్రువీకరించారు.
కానీ తాను తిరస్కరించానని, అది అధిష్టానం స్థాయి నిర్ణయమని చెప్పానని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన మధ్య పొత్తు ఖాయమనే ప్రచారం చాలా రోజులుగా ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటికే టీడీపీ-జనసేన ఒక్కటే అని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్న సమయంలో తాజాగా నారా లోకేష్ జనసేన కార్యాలయంలోకి వెళ్లడం మరింత తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

టీడీపీ మాజీ మంత్రులు ఓపెన్ గానే..
ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలు చేస్తున్నా.. ఆయన వెనుక చంద్రబాబు ఉన్నాడని పదేపదే మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. అయితే నారా లోకేష్ మర్యాదపూర్వకంగానే జనసేన కార్యాలయానికి వెళ్లారని.. ఇందులో ఎలాంటి ఉద్దేశాలు లేవని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుతం లోకేష్ జనసేన కార్యాలయంకు వెళ్లటం..అక్కడ కార్యకర్తలను పలకరించటం టీడీపీ నేతలు చెబుతున్నట్లుగా కాకతాళీయమే అయినా.. రానున్న రోజుల్లో మాత్రం ముఖ్యమంత్రి జగన్ ను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా రెండు పార్టీలు కలిసి పని చేయాలంటూ ఇప్పటికే టీడీపీకి చెందిన మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప... పితాని సత్యనారాయణ లాంటి వారు ఓపెన్ గానే అప్పీల్ చేస్తున్నారు.

పొత్తు ఖాయమంటూ జోరుగా ప్రచారం
పవన్ సైతం తన ప్రసంగాల్లో ఎక్కడా టీడీపీని విమర్శించటం లేదు. టీడీపీ సైతం బీజేపీ - జనసేన గురించి ఎటువంటి ప్రస్తావన చేయటం లేదు. దీంతో..ఇప్పుడు బీజేపీ సైతం ఏపీలో రాజకీయంగా ఎదిగేందుకు వైసీపీని టార్గెట్ చేస్తూ కొత్త రాజకీయ అడుగులు వేస్తోంది. బీజేపీ - జనసేన మైత్రి సైతం నామ్ కే వాస్తే అన్నట్లుగా కనిపిస్తోంది. దీంతో..ఇక, రానున్న రోజుల్లో టీడీపీ - జనసేన మధ్య పొత్తు ఖాయమనే ప్రచారం ఇప్పటికే మొదలైన సమయంలో..లోకేష్ తాజా అడుగులతో ఆ చర్చకు మరింత బలం చేకూరుతోంది.












Click it and Unblock the Notifications