జగన్ స్పీడ్ చూస్తుంటే గాలి పీల్చినా, వదిలినా జే ట్యాక్స్ వసూలు చేసేలా ఉన్నారు: లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీ చార్జీలు పెంచుతూ జగన్ ప్రభుత్వం మరోమారు నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిందని, ఆర్టీసీ బస్సులను నిర్వహించడానికి వీలుగానే చార్జీల సవరణ జరిగిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్ల కాలంలో 5680 కోట్ల నష్టం వచ్చిందని వెల్లడించారు. ఇక డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయని పేర్కొని డీజిల్ సెస్ రూపంలో ఆర్టీసీ చార్జీలను పెంచుతూ జగన్ సర్కార్ ప్రకటన చేసింది.

కాదేది బాదుడే బాదుడు కి అనర్హం అంటున్న వైసీపీ సర్కార్: లోకేష్
అయితే తాజాగా పెరిగిన ఆర్టీసీ ఛార్జీలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసిపి సర్కారును, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఏపీలో పెరిగిన ఆర్టీసీ ఛార్జీలపై అసహనం వ్యక్తం చేసిన లోకేష్ వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పీడ్ చూస్తుంటే..గాలి పీల్చినా, వదిలినా జే ట్యాక్స్ వసూలు చేసేలా ఉన్నారు అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. చెత్త పన్ను, ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు కాదేది బాదుడే బాదుడుకి అనర్హం అంటోంది వైసిపి ప్రభుత్వం అంటూ సోషల్ మీడియా వేదికగా లోకేష్ మండిపడ్డారు.

మూడేళ్ళలో రెండు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం దారుణం
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్యులు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ ధరలు, విపరీతంగా పెరిగిన వివిధ రకాల పన్నులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లోకేష్ పేర్కొన్నారు. సామాన్యుడిపై పెనుభారాన్ని మోపేలా పల్లె వెలుగు నుండి ఏసీ బస్సుల వరకూ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని లోకేష్ వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో రెండు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం దారుణం అని లోకేష్ మండిపడ్డారు.

కుడి చేత్తో పది రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయలు కొట్టేసే జగన్ రెడ్డి
ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. కుడి చేత్తో పది రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయలు కొట్టేసే విధానాలకు జగన్ రెడ్డి ఇకనైనా స్వస్తి పలకాలని లోకేష్ హితవు పలికారు. ఇప్పటికే ఏపీలో వైసీపీ అరాచక పాలనపై విరుచుకుపడుతున్న లోకేష్ తాజాగా జగన్ బాదుడుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్రంలో సామాన్య ప్రజలపై జగన్ రోజుకో భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications