హత్యా? ఆత్మహత్యలా?: వేర్వేరు గదుల్లో విగతజీవులుగా ప్రేమ జంట, ఏం జరిగింది?
హైదరాబాద్: సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖైరతాబాద్లో విషాద ఘటన చోటు చేసుకుంది. వేర్వేరు కుటుంబాలకు చెందిన యువతి, యువకుడు ఒకే ఇంట్లోని వేర్వేరు గదుల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారిది హత్యా? ఆత్మహత్యా? అనేది అంశంపై విచారణ ప్రారంభించారు. ఘటనా స్థలానికి సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ సీహెచ్ సుధీర్, సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్రెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి, పలువురు ఎస్ఐలు, సిబ్బంది చేరుకుని సమాచారం సేకరించారు.
ఇంటికొస్తుండేవాడు..
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్లోని న్యూ సీఐబీ క్వార్టర్స్కు చెందిన శ్రీనివాస్ కూతురు వర్షశ్రీ (22) ఇంజినీరింగ్ చేస్తోంది. బడంగ్పేటకు చెందిన ఆమె మిత్రుడు మహేశ్వర్రెడ్డి (24) తరుచూ ఇంటికొచ్చి ఆమెను కలుస్తుంటాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. కాగా, మహేశ్వర్ రెడ్డి ఇబ్రహీంపట్నంలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
పెద్దగా అరుపులు
వర్షశ్రీ బంధువుల పెళ్లికి కుటుంబ సభ్యులంతా గురువారం నగరంలోని నల్లకుంటకు వెళ్లారు. రాత్రి రెండున్నరకు ఆమె తన చిన్నాన్న కుటుంబంతో కలిసి ఇంటికి చేరుకుంది. శుక్రవారం ఉదయం ఆమె తండ్రి శ్రీనివాస్ విధులకు వెళ్లగా ఇంట్లో నానమ్మ శంకరమ్మ (80), వర్షశ్రీ ఉన్నారు. ఈ క్రమంలో మహేశ్వర్రెడ్డి మధ్యాహ్నం 2:15కు ఖైరతాబాద్లోని ఆమె ఇంటికి చేరుకున్నాడు. కాసేపటి తర్వాత పెద్దగా అరుపులు వినిపించినట్లు స్థానికులు తెలిపారు.
విగత జీవులుగా..
శుక్రవారం మధ్యాహ్నం 2.30గంటలకు నల్లకుంటలో మందుల దుకాణం నిర్వహిస్తున్న తన అన్న వెంకటసుమన్కు ఫోన్ చేసింది. వెంటనే ఏడుస్తూ ఫోన్ పెట్టేసింది. ఏం జరిగిందోనని అతను 15 నిమిషాల్లో ఇంటికి చేరుకోగా ఓ పడక గదిలో మహేశ్వర్రెడ్డి ఫ్యాన్కు చీరతో ఉరేసుకుని కనిపించాడు. తన చెల్లి కనిపించక పోవడంతో మరో పడక గదికి వెళ్లగా లోపలి నుంచి గొళ్లెం వేసి ఉంది. బలంగా తలుపుల్ని నెట్టడంతో లోపల కిటికీ చువ్వలకు చీరతో ఉరేసుకుని కనిపించింది. యువతి నొసటిపై గాయం, ముక్కులో నుంచి రక్తం కారి ఉండటంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందన్న అనుమానం వ్యక్తం అవుతోంది.
హత్యా? ఆత్మహత్యలా?
కాగా, బయటి వ్యక్తి ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడంతో అతని కుటుంబ సభ్యులు వచ్చేదాకా పోలీసులు మృతదేహాలను అక్కడే ఉంచారు. వారు రావడంతోనే మహేశ్వరరెడ్డిని హత్య చేశారని ఆరోపించారు. ఆ సమయంలో ఇరు కుటుంబాల మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు యువకుడి బంధువుల్ని బయటకు పంపారు. కాగా, యువకుడు వచ్చినపుడు తనతో పాటు మిఠాయి డబ్బా, మద్యం సీసాతో తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వర్షశ్రీ, మహేశ్వర్ రెడ్డి మృతితో వారి రెండు కుటుంబాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
పెళ్లి చేసుకుంటానని..
ఇది ఇలా ఉండగా, గత కొద్ది రోజులుగా యువతిని పెళ్లిచేసుకుంటానని ఆమె కుటుంబ సభ్యులతో మహేశ్వరరెడ్డి ప్రస్తావించినట్లు తెలిసింది. దీంతో మీ కుటుంబ పెద్దల్ని తీసుకురా మాట్లాడదామని వారు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆ పనిచేయకుండా అతను ఇంటికి వస్తుండటంతో అతనిపై కోపగించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యువతీయువకులిద్దరూ మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది.