హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష
మహబూబ్నగర్: మహబూబ్నగర్లో చిన్నారి శ్రేయ (6)ను కిడ్నాప్ చేసి, దారుణంగా హత్యచేసిన కేసులో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. టీచర్స్ కాలనీకి చెందిన నాగరాజు, రజిత దంపతుల వద్ద కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే మహమ్మద్ యాకూబ్ తన యజమాని కుమార్తె శ్రేయను ఏప్రిల్ 17న కిడ్నాప్ చేశారు.
ఆ తరువాత ఆ చిన్నారి తల్లిదండ్రులను రూ.10 లక్షలు డిమాండ్ చేసి, ఈ లోపు ఆ చిన్నారిని ఆటోలోనే నోరు, ముక్కూ మూసి, గొంతుపిసికి హత్య చేశాడు. బాలిక శవం జిల్లాలోని అడ్డాకుల మండలం పోల్కంపల్లిలోని బావిలో కనిపించింది. ఈ దారుణ సంఘటనలో యాకూబ్ స్నేహితులు మహమ్మద్ నసీం, సయ్యద్ అమీర్ కూడా పాలు పంచుకున్నట్లు విచారణలో రుజువైంది.
ఈ హత్య కేసులో ఆ ముగ్గురు నిందితులకు యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ జిల్లా జడ్జీ టి.గంగిరెడ్డి శుక్రవారం తీర్పు చెప్పారు. కిడ్నాప్ కేసులో 10 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించారు. అన్ని శిక్షలు ఏకకాలంలో అమలవుతాయి. ఒక్కో నిందితుడికి ఐదు లక్షల చొప్పన జరిమానా విధించారు.
కోర్టు హాలులో తుది తీర్పు వెలువరించే సమయంలో శ్రేయ తల్లిదండ్రులు కళ్లు మూసుకుని ప్రార్థిస్తూ ఉండటం కనిపించింది. తీర్పు సందర్భంగా కోర్టు హాలు న్యాయవాదులు, శ్రేయ బంధువులతో కిక్కిరిసి పోయింది. వారికి మరణశిక్ష విధించాల్సి ఉండిందని శ్రేయ తల్లి రజిత అంటోంది.