భార్య కాపురానికి రాలేదని కూతుర్ని బండకేసి కొట్టాడు
మహబూబ్నగర్: భార్య కాపురానికి రాలేని ఆగ్రహించిన ఓ వ్యక్తి.. నాలుగేళ్ల తన కూతురిని బండకేసి కొట్టాడు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన బుధవారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా ఆత్మకూరు మండలం కొంకలవానిపల్లెలో చోటు చేసుకుంది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంకలవానిపల్లెకు చెందిన మణెమ్మ తన కుమార్తె లక్ష్మిని అదే గ్రామానికి చెందిన నాగరాజుకు ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేసింది. అప్పుడు రెండున్నర తులాల బంగారం, రూ. 30వేల నగదును వరుడికి ఇచ్చింది. డబ్బును మద్యం సేవించడానికి ఖర్చు చేసిన నాగరాజు, భార్య లక్ష్మిని తరచూ కొట్టేవాడు.
నెలకిందట కూడా మద్యం తాగివచ్చి తీవ్రంగా కొట్టడంతో మనస్తాపానికి గురైన లక్ష్మి.. తన కుమార్తె మహేశ్వరి(4)ని తీసుకుని కొత్తకోట మండలం నర్సింగపూర్లో ఉన్న తన చిన్నమ్మ ఇంటికి వెళ్లింది. కాగా, నాగరాజు అక్కడి వెళ్లి ఆమెతో ఘర్షణ పడ్డాడు. ఆ తర్వాత లక్ష్మి తన స్వగ్రామానికి వచ్చింది. విషయం తెలుసుకున్న నాగరాజు అత్తవారింటికి రావాలని లక్ష్మిని కోరాడు.
అందుకు ఆమె నిరాకరించడంతో కూతురు మహేశ్వరిని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అత్త మణెమ్మ అడ్డుపడటంతో ఆమెను తోసుకుని తీసుకెళ్లాడు. ఆ తర్వాత పదినిమిషాలకే మహేశ్వరిని బండకేసి కొట్టి చంపాడు. చుట్టుపక్కల వారు అడ్డుకునే లోపే ఆ చిన్నారి మృతి చెందింది. నాగరాజును పట్టుకున్న స్థానికులు, పోలీసులకు అప్పగించారు.