యువతులు సంబంధం చూడమంటే పెళ్లాడతానన్నాడు
హైదరాబాద్: పెళ్లి సంబంధం చూడమని చెప్పిన ఇద్దరు యువతులను.. తానే పెళ్లి చేసుకుంటానని ఓ వ్యక్తి నిర్బంధించిన సంఘటన హైదరాబాదులోని బంజారాహిల్స్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అతనిని బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ దేవరకొండ బస్తీకి చెందిన పందొమ్మిది, ఇరవయ్యేళ్ల ఇద్దరు యువతులు పెళ్లి సంబంధాలు చూడాలంటూ లంగర్ హౌస్లోని సర్దార్ బాగ్లో నివాసం ఉండే మౌలానా అబుల్ హసన్ అనే వ్యక్తికి చెప్పారు. వారు ఈ నెల 3న అతనిని కలిశారు.
బయోడేటా తీసుకు రావాలని వారికి సూచించాడు. మరుసటి రోజు బయోడేటాతో వెళ్లిన ఇద్దరు యువతులను.. తానే పెళ్లి చేసుకుంటానని, ఇక్కడే ఉండాలని కోరాడు. దీంతో అతడి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, అతను వారిని షహనాజ్ బేగం అనే మహిళ ఇంట్లో దాదాపు రెండు వారాల పాటు నిర్బంధించాడు.
తమ కూతుర్లు కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాఫ్తు చేసిన పోలీసులు ఆరా తీశారు. యువతులను నిర్బంధం నుండి విడిపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మంగళవారం నిందితుడిని అరెస్టు చేశారు. అతనిని రిమాండుకు తరలించారు.
తల్లిపై దాడి
స్నేహితుల మధ్య డబ్బుల విషయంలో చోటు చేసుకున్న వివాదంలో ఆవేశంతో స్నేహితురాలి తల్లిని గాయపర్చిన సంఘటన సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరధిలో మంగళవారం జరిగింది.
పీ అండ్ టీ కాలనీకి చెందిన 22 ఏళ్ల గిరిజ, సికింద్రాబాద్కు చెందిన ఇరవయ్యొక్క ఏళ్ల మానస స్నేహితులు. మానస మంగళవారం గిరిజ ఇంటికి వచ్చింది. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆవేశంలో మానస ఇంట్లో ఉన్న గిరిజ తల్లి అనురాధను తలపైన కర్రతో కొట్టింది.
దీంతో అనురాధకు బలమైన గాయమైంది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. గిరిజ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.