వర్షాలు: చెట్టును పట్టుకొని.. వరద పెరగడంతో పైకెక్కాడు, హెలికాప్టర్తో..
గుంటూరు: గుంటూరులో భారీ వర్షం కురుస్తోంది. జిల్లాలోని వాగులు, వంకలు పొంగుతున్నాయి. పలుచోట్ల రోడ్లు కొట్టుకు పోయాయి. కప్పగంజి వాగులో ఓ వ్యక్తి వరద నీటిలో చిక్కుకుపోయాడు. అతని తాడి చెట్టును పట్టుకొని నిలబడ్డాడు.
అతను అలాగే చెట్టును పట్టుకొని గంటలపాటు నిలబడ్డాడు. ఆ తర్వాత వరద నీరు మరింత పెరుగుతుండటంతో.. తాడి చెట్టు పైకి ఎక్కాడు.
తనను కాపాడాలని కోరుతున్నాడు. నీటిలో చిక్కుకుపోయిన వ్యక్తి పేరు సింగరయ్య అని తెలుస్తోంది. అతనిని కాపాడాలని మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆదేశించారు. కాగా, అతనిని హెలికాప్టర్ ద్వారా కాపాడే అవకాశముంది. వరద ప్రాంతాల్లో హెలికాప్టర్తో సహాయక చర్యలకు ఉపక్రమించారు.
గుంటూరు జిల్లా నరసరావుపేటలో బుధవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. సమీపంలోని వాగులు, వంకలు పొంగుతున్నాయి. నరసారావు పేటలోని కత్తచెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో సత్తెనపల్లి రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు కాలనీలు జలమయమయ్యాయి.
గుంటూరు రోడ్డులో స్వర్గపురి వద్ద నాలుగు అగడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. రహదారిపై నీటిని మళ్లించేందుకు డివైడర్లను పగులగొట్టారు. మరోవైపు ఎల్లమంద గ్రామం వద్ద ఏడుమంగళ వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో వాగు పరీవాహక ప్రాంత కాలనీల్లోకి నీరు చేరింది.
లింగంకుంట్ల గ్రామంలోని మంచినీటి చెరువులోకి భారీగా వర్షపు నీరు చేరడంతో పక్కనే ఉన్న ఎస్సీ కాలనీ జలమయమైంది. సహయక చర్యల్లో భాగంగా బాధితులకు పదివేల పులిహోర ప్యాకెట్లు, 50వేల మంచినీటి ప్యాకెట్లను అందించనున్నట్లు ఆర్డీవో తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో బుధవారం అర్ధరాత్రి నుంచి గుంటూరు జిల్లా సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా సుమారు ఆరు గంటలపాటు కురిసిన వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
సత్తెనపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలు పట్టణంలోని బసవమ్మవాగు వద్ద నిలిచిపోయాయి. రాజపాలెం మండలంలోని అనుపాలెం వద్ద వాగు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సత్తెనపల్లిలో 10 సె.మీ. వర్షపాతం నమోదయింది.