శాస్త్రవేత్త: నకిలీ విడాకుల నోటీసుతో రెండో పెళ్లికి రెడీ
కర్నూలు: డబ్బుల కోసం రెండో పెళ్లికి సిద్దపడిన ఓ శాస్త్రవేత్త గుట్టు రట్టయింది. భార్యను అదనపు కట్నం కోసం వేధించి, అత్తింటి వారు అంగీకరించలేదు. దీంతో డబ్బు కోసం రెండో పెళ్ళికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న భార్య కుటుంబ సభ్యులు పెళ్లి మండపానికి వచ్చి పెళ్లిని ఆపి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ ఘటన కర్నూలు జిల్లాలోని నంద్యాలలో శుక్రవారం జరిగింది. అనంతపురానికి చెందిన ఇనాయతుల్లాకు గుంతకల్లుకు చెందిన హమీదాబీతో 2008లో పెళైంది. కట్నకానుకల కింద రూ.5 లక్షలు నగదు, బంగారు అభరణాలు ఇచ్చారు. వీరికి ఇద్దరు సంతానం.
ఇనాయతుల్లా చెన్నైలో ఓ కంపెనీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాడు. అదనపు కట్నం కోసం భార్యను నిత్యం వేధిస్తూ వచ్చాడు. అత్తంటి వారు అంగీకరించకపోవడంతో భార్యకు విడాకుల నోటీసు పంపి డబ్బు కోసం రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు.
శుక్రవారం నంద్యాలలోని ఎన్టీఆర్ షాదీఖానాలో పెళ్లి చేసుకుంటున్నాడన్న విషయం తెలిసి హమీదాబీ కుటుంబ సభ్యులతో నంద్యాలకు చేరుకున్నారు. పెళ్ళిని ఆపి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఇనాయతుల్లాను స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. కాగా హమీదాబీ తనకు పంపిన విడాకుల నోటీసును కోర్టులో చూపించగా అవి నకిలీవని తేల్చారు.