కన్న తండ్రే కామాంధుడు: 4గురు పిల్లలతో కలసి నిప్పంటించుకున్న తల్లి
అమరావతి: చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. కన్న తండ్రే కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడుతుండటంతో దానిని జీర్ణించుకోలేని ఓ తల్లి తనతో పాటు నలుగురు పిల్లలపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ సంఘటనలో తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలు మృతి చెందగా, ఇద్దరు కుమారులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన జరీనా(28)ను పుంగనూరుకు చెందిన రెహమాన్ రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు పిల్లలు అయేషా(13), మహమ్మద్ (10), అంజుమ్(6), నాగూర్ (8) ఉన్నారు. మద్యానికి బానిసైన రెహమాన్ రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి కుమార్తె అయేషాను లైంగిక వేధించేవాడు.
ఈ విషయమై చాలాసార్లు జరీనా భర్తతో గొడవపడింది. తాజాగా మంగళవారం రాత్రి రెహమాన్ మద్యం సేవించి వచ్చిన రెహమాన్ భార్య, కుమార్తెతో గొడవ పడ్డాడు. దీంతో ఇక బ్రతకలేమని ''ఇలాంటి బతుకు వద్దమ్మా.. చచ్చిపోదాం..'' అని కుమార్తె జరీనాకు సలహా ఇచ్చింది.
దీంతో బుధవారం ఉదయం ఉదయం 7 గంటలకు రెహమాన్ ఇంటి నుంచి బయటకు వెళ్లగానే ఇంట్లో తలుపు గడియ పెట్టుకుని నలుగురు పిల్లలు ఆయేషా (13), మహ్మద్ (10), నాగూర్ (8), అంజుమ్ (6)పై కిరోసిన్ పోసి నిప్పంటించి ఆత్యహత్యకు యత్నించింది.

దీంతో చిన్నారుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. స్థానికులు వెంటనే తలుపులు పగులగొట్టి మంటల్లో కాలిపోతున్న తల్లితో పాటు పిల్లలను కూడా పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ జరీనా,ఆయేషా, అంజుమ్ మరణించారు. మగ పిల్లలు మహ్మద్, నాగూర్ పరిస్థితి విషమంగా ఉంది. పుంగనూరులో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో జరీనాను పుంగనూరు న్యాయమూర్తి మోతీలాల్ కలసి వాంగ్మూలం నమోదు చేశారు.
''నా భర్త.. మా పెద్ద కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ దారుణాన్ని అడ్డుకోలేక.. నాతో సహా ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలపై కిరోసిన్ పోసి నిప్పంటించుకున్నా..'' అని జరీనా తన మరణ వాంగ్మూలంలో పేర్కొన్నట్లు ఎస్ఐ హరిప్రసాద్ వెల్లడించారు. కాగా, ప్రాణాలతో బయటపడిన ఇద్దరు కుమారులను ప్రభుత్వ హాస్టల్ లేదా మదర్సాలో సంరక్షించనున్నట్లు తహశీల్దార్ మనిరాజు తెలిపారు.












Click it and Unblock the Notifications