అక్రమ సంబంధమని అనుమానం: భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. కలిసి నడుస్తానని హామీ ఇచ్చిన భర్తే భార్య పట్ల కాలయముడయ్యాడు. భార్యపై అనుమానం వచ్చి గొడ్డలితో నరికి చంపాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలోని కొత్తపల్లి మండలం బంగినాయినిపల్లిలో తీవ్ర సంచలనం సృష్టించింది.
బోయ వెంకటరమణ, చోళత్తమ్మలకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న బోయ వెంకటరమణ గురువారం అర్థరాత్రి గొడ్డలితో ఆమెపై దాడికి దిగాడు.
భార్యను నరికిన తర్వాత వెంకటరమణ తానే చంపేశానంటూ పెద్దగా కేకలు వేశాడు. ఇది విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులను శుక్రవారంనాడు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
భార్యపై అనుమానంతోనే తాను హత్య చేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.