ఆయన రాజేసిన చిచ్చును ఆర్పుతున్న చంద్రబాబు
Chandrababu: శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై మన్యం భగ్గుమంటోంది. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా రెండు రోజుల పాటు బంద్ను ప్రకటించింది. ఈ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రేపు రెండో రోజుకు చేరుకుంటుంది. మన్యం ప్రాంతాలన్నీ కూడా నిర్మానుష్యం అయ్యాయి.
ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి 1/70 చట్టంలో సడలింపులు చేయాల్సిన అవసరం ఉందంటూ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా నేడు, రేపు బంద్కు అఖిలపక్ష ప్రజా సంఘాలు ఇచ్చాయి. ఈ పిలుపునకు అనుగుణంగా ఏజెన్సీ బంద్ పాటిస్తోంది. ఆదివాసీ గిరిజన సంఘం బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఇప్పటికే గూడేల్లో విస్తృత ప్రచారాలు చేపట్టాయి.. ప్రజా సంఘాలు.

స్వర్ణాంధ్ర ప్రదేశ్ విజన్-2047లో భాగంగా టూరిజం పాలసీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..ముందుకు తెచ్చిందంటూ మండిపడుతున్నాయి.
పర్యాటకం పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రకృతి సిద్ధమైన ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలను ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు ధారదాత్తం చేయడానికి రంగం సిద్ధం చేసిందంటూ ఆరోపిస్తోన్నాయి. గిరిజన సలహా మండలి, పీసా చట్టం వంటి గిరిజన రక్షణ కవచాలు ఒక్కొక్కటీ నిర్వీర్య దిశగా సాగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తోన్నాయి.
ఆదివాసీ ప్రాంతంలో గిరిజనులకు వంద శాతం ఉద్యోగ రిజర్వేషన్ను కల్పించే జీఓ 3ను రద్దు చేయడం వల్ల అనేకమంది గిరిజనేతర ఉద్యోగులు ఏజెన్సీకి రావడంతో ఇక్కడి గిరిజన యువతకు ఉద్యోగాలు లేకుండాపోయాయని విమర్శిస్తోన్నాయి ప్రజా సంఘాలు. దీనిపై ఆదివాసీల్లో అసంతృప్తి నెలకొంది.
దీనిపై తాజాగా చంద్రబాబు స్పందించారు. గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదని అన్నారు. గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేననే విషయాన్ని తాము బలంగా నమ్ముతున్నామని, అందుకే వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి నిరంతరం పనిచేస్తున్నామని చెప్పారు.
గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందించామని, అరకు కాఫీతో సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తోన్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో 3ను తీసుకొచ్చామని, గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకు మాత్రమే దక్కేలా కృషి చేశామని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా న్యాయపరమైన చిక్కులతో ఆ ఉత్తర్వు రద్దు అయ్యిందని ఆయన ఆరోపించారు.
దాని పునరుద్ధరణకు తాము కృషి చేస్తామని చంద్రబాబు అన్నారు. గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై గిరిజనులకే హక్కు ఉండాలన్న ఆలోచనతో వచ్చిన 1/70 చట్టాన్ని మార్చే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదని, అలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, అనవసరమైన అపోహలతో ఆందోళన చెందవద్దని గిరిజన సోదరులను కోరుతున్నానని అన్నారు.












Click it and Unblock the Notifications