మావోయిస్ట్ కేంద్ర కమిటీ టెక్ టీమ్ దంపతుల అరెస్టు
హైదరాబాద్: మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నిషేధిత మావోయిస్టు కేంద్ర కమిటీ టెక్నికల్ టీమ్లో పనిచేస్తున్న దంపతులను ప్రత్యేక నిఘా విభాగం (ఎస్ఐబి) పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం రాత్రి వారిని పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టయిన మావోయిస్టులను అనంతపురం జిల్లాకు చెందిన కిష్టప్ప అలియాస్ కృష్ణ (40), నెల్లూరు జిల్లాకు చెందిన ఆయన భార్య లక్ష్మి అలియాస్ భవానీ (35)లుగా గుర్తించారు. కిష్టప్ప 20 ఏళ్లుగా మావోయిస్టులతో కలిసి పనిచేస్తున్నాడు. భవానీ 12 ఏళ్లుగా పనిచేస్తోంది.
గట్టి నిఘా పెట్టిన పోలీసులు మంగళవారం రాత్రి బెంగళూర్లోని బంగలగుంటే ప్రాంతంలోని ఆనందప్ప లేఅవుట్లోని ఆశ్రయంలో వారిని పట్టుకున్నారు. తమ ఉనికి తెలియకుండా ఉండడానికి కిష్టప్ప సుతారిగా పనిచేస్తుండగా, భవానీ కుట్టుపని చేస్తూ వస్తోంది.
దంపతులు ఇంటికి తాళం వేసి ప్రతి ఏడాది మూడు నాలుగు నెలలు ఒకసారి లేదా రెండు సార్లు వెళ్లిపోయేవారని, వారు స్వస్థలం వెళ్లి ఉంటారని తాను అనుకుంటూ ఉండేవాడినని ఇంటి యజమాని రమణయ్య చెప్పారు. దంపతుల నుంచి పోలీసులు రెండు బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కాల్ వివరాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు.
కిష్టప్ప తలపై ఐదు లక్షల రూపాయలు, లక్ష్మి తలపై నాలుగు లక్షల రూపాయలు రివార్డులున్నాయి. విచారణ తర్వాత పోలీసులు వారిని ఆంధ్రప్రదేశ్లోని నల్లమల ప్రాంతం శాంతిభద్రతల పోలీసు స్టేషన్లకు అప్పగిస్తామని ఎస్ఐబి పోలీసులు తెలిపారు.