డబ్బుంటేనే, జగన్కి కోట్లెక్కడివి: మారెప్ప, జగన్ సవాల్
హైదరాబాద్: కులం, డబ్బు ఉన్నోళ్లకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో అందలం ఎక్కిస్తారని మాజీ మంత్రి మారెప్ప శనివారం మరోసారి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లాలో హత్య కేసులో జైలుకెళ్లిన వ్యక్తి కన్వీనర్ అయ్యారని ఆరోపించారు. 2004లో వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి రూ.24 కోట్ల అప్పులు ఉంటే ఇప్పుడు జనగ్ అత్యంత ధనవంతుడు ఎలా అయ్యారో చెప్పాలన్నారు.
కాగా, ఈ నెల 17వ తేదీన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జంతర్ మంతర్ వద్ద మహా ధర్నాకు చేపట్టనుంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్య శంఖారావం పేరిట ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆ పార్టీ తెలిపింది. ఆరువేలకు పైగా మందితో ఈ ధర్నా చేపడతామని పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 15న మధ్యాహ్నం పన్నెండు గంటలకు తిరుపతి, రాజమండ్రి నుంచి రెండు ప్రత్యేక రైళ్లు ఢిల్లీకి బయలుదేరుతాయని, తిరుపతి నుండి బయలుదేరే రైలు కడప, గుత్తి, కర్నూలు, సికింద్రాబాదు, రామగుండం మీదుగా వెళ్తుందన్నారు.
రాజమండ్రి నుండి బయలుదేరే రైలు ఏలూరు, విజయవాడ, ఖమ్మం, ఖాజీపేట, మంచిర్యాలల మీదుగా ఢిల్లీకి వెళ్తుందని చెప్పారు. సమైక్య తీవ్రతను తాము ఢిల్లీలో పెద్దలకు తెలియజేసేందుకే ఈ ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు.
విభజన అడ్డగోలు నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయం అడ్డగోలుదని వైయస్ జగన్ విశాఖ జిల్లా సమైక్య శంఖారావంలో మండిపడ్డారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్ర విభజన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ముప్పై స్థానాలను గెలుచుకుంటే రాష్ట్రాన్ని కేంద్రం ఎలా విభజిస్తుందే చూస్తామని సవాల్ చేశారు.