వివాహిత అనుమానాస్పద మృతి: అత్తింటివారే హత్య చేశారన్న ఆరోపణలు..
విజయవాడ: వరకట్న వేధింపులు మరో వివాహితను బలితీసుకున్నాయి. వివాహమైనప్పటి నుంచే దంపతుల మధ్య తరుచూ గొడవలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వివాహిత అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. . కృష్ణా జిల్లా గుడివాడ మండలం చౌటుపల్లికి చెందిన శ్రీలక్ష్మికి రామలింగేశ్వరనగర్కు చెందిన రాజేశ్కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.2.5లక్షల నగదు, 1.2సెంట్ల భూమి కట్నంగా ఇచ్చారు. పెళ్లి తర్వాత భార్యభర్తలు ఎప్పుడూ గొడవ పడుతుండేవారని బంధువులు చెబుతున్నారు.
ఇదే క్రమంలో అత్తగారింట్లో శ్రీలక్ష్మీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. అదనపు కట్నం కోసం అత్తింటి వారే శ్రీలక్ష్మిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు.
అదనపు కట్నం కోసం శ్రీలక్ష్మిని అత్తింటివారు తరుచూ వేధించేవారని బంధువులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెను అన్యాయంగా బలితీసుకున్నవారిని కఠినంగా శిక్షించాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.