ఇసుక కోసం చంద్రబాబు పోరాటం వెనుక మాస్టర్ ప్లాన్ .. ఇప్పుడే ఎందుకు అంటే ?
ఏపీ మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జగన్ సర్కార్ వల్లతలెత్తిన ఇసుక సమస్యపై పోరాటం చెయ్యాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు . ఇసుక కొరతపై ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పార్టీ నాయకులకు, శ్రేణులకు పిలుపునిచ్చిన బాబు ఇసుక కోసం పోరాటం చెయ్యాలని కదం తొక్కాలని పార్టీ నేతలకు సూచించారు. ఏపీలో నెలకొన్న ఇసుక కొరత పై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేయాలని చెప్పిన చంద్రబాబు ఆలోచన వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

ఇసుక కోసం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు చంద్రబాబు నిర్ణయం .. పార్టీ శ్రేణులకు పిలుపు
ఏపీలో నెలకొన్న ఇసుక సమస్యపై చంద్రబాబు పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో డ్వాక్రామహిళలకు ఆదాయం వచ్చేలా ఇసుక పంపిణీ చేశామని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత ఉచితంగా ఇసుక అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పుకున్నారు . వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక ధరలు చుక్కలనంటాయని ఆరోపించారు. నిర్మాణ రంగం కుదేలైంది అని, ఇసుక ధర ఎక్కువగా ఉందని, వైసీపీ నేతలకు లబ్ధి చేకూర్చడం కోసం ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ నిర్ణయం తీసుకుందని చెప్పి , ఎమ్మెల్యేలు, ఎంపీలు ,మంత్రులు వాటాలు వేసుకుని మరీ ఇసుక దోపిడీ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.ఇసుక కొరతతో 20 లక్షల మంది కార్మికుల పొట్ట కొట్టారని అందుకే ఇసుక కోసం సమరం చెయ్యాలని చెప్పిన చంద్రబాబు మూడు నెలలుగా విమర్శలకు మాత్రమే పరిమితం అయ్యారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఇసుక కోసం పోరాటం చెయ్యాలని చెప్పటం ఈ వారంలో ఇసుక ఏపీలో అందుబాటులోకి రానుంది కాబట్టే అన్న భావన వ్యక్తం అవుతుంది.

ఈ వారంలో అందుబాటులోకి రానున్న ఇసుక .. ఇప్పుడు బాబు ఆందోళనల వెనుక పెద్ద స్ట్రాటజీ
సెప్టెంబర్ 5నుండి అందరికీ ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే రీచ్లు, స్టాక్పాయింట్ల నిర్వహణకు టెండర్లు ఖరారు చేసిన ప్రభుత్వం, ఇక పనులు మొదలుపెట్టుకోవాలని టెండరుదార్లకు చెప్పింది . నూతన ఇసుక విధానం వచ్చేనెల 5నుంచి అమల్లోకి రానున్న నేపధ్యంలో ఆ తేదీనుంచి వినియోగదారులకు ఇసుక అందించాలంటే ముందుగానే సిద్ధం కావాలని చెప్పి , వారంరోజుల్లో రవాణాకు సంబంధించిన పనులు మొదలుపెట్టాలని వారికి సూచించింది. ఇదే సమయంలో చంద్రబాబు ఈ నెల ౩౦ న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెయ్యాలని చెప్పటం టీడీపీ పోరాటంతోనే ఇసుక సమస్య పరిష్కారం అయ్యింది అన్న భావన కల్పించటానికే అనే వ్యూహంలో భాగం అని రాజకీయ వర్గాల భావన. ఇక ఇదే విషయాన్ని వైసీపీ నేతలు సైతం చెప్తున్న పరిస్థితి . ఇంతకాలం విమర్శాలకే పరిమితం అయ్యి తీరా ఇసుక ఇచ్చే సమయానికి ఇదు రోజుల ముందు ఆందోళన చేస్తే ఇసుక అందుబాటులోకి తెచ్చిన ఘనత టీడీపీదే అని చెప్పుకోవచ్చన్న ఆలోచనతోనే చంద్రబాబు ఈ మాస్టర్ ప్లాన్ చేశారని తెలుస్తుంది.

సమస్య పరిష్కారం అయ్యేముందు బాబు పోరాటం .. రాజకీయాలపై పెదవి విరుస్తున్న ప్రజలు
పాత ఇసుక విధానంలోనూ అవకతవకలు ఉన్నాయి. కొత్త ఇసుక విధానం కోసం ఇంత కాలం జగన్ సర్కార్ ఇసుక అందించకుండా నిర్మాణ రంగాన్ని కుదేలు చెయ్యటం కూడా తప్పే. ఏది ఏమైనా రాజకీయ కారణాలతో ప్రజలతో ఓ ఆటాడుకుంటున్నారు పొలిటికల్ పార్టీలు. సమస్య ఉన్నప్పుడు పోరాటం చెయ్యటం తప్పు కాదు కానీ సమస్య పరిష్కారం అయ్యే సమయానికి వచ్చి హడావిడి చేసి ప్రజల కోసం పోరాటం చేస్తామంటే నమ్మే స్థితిలో ఏపీ ప్రజలు లేరు. కచ్చితంగా చెప్పాలంటే తాజా పరిణామాలు ఏపీ ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. చంద్రబాబు వంటి రాజకీయ అనుభవజ్ఞుడు సమస్యల కోసం న్యాయంగా పోరాటం చెయ్యాలి తప్ప అవకాశాన్ని బట్టి కాదు అన్నది ప్రజల భావన .












Click it and Unblock the Notifications