మద్యం తాగించి బాలికపై ఇద్దరు సామూహిక ఆత్యాచారం
నెల్లూరు జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు మతిస్థిమితం లేని ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
నెల్లూరు: మతిస్థిమితం లేని ఓ బాలికపై ఇద్దరు వ్యక్తులు ఆదివారం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు సరిగా స్పందించలేదు. దీంతో మహిళలు ఆగ్రహించారు. నిందితులకు దేహశుద్ధి చేశారు. వారు ఉండే గుడిసెను ధ్వంసం చేశారు.
ఈ సంఘటన నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో జరిగింది. సంగం మండలం జెండాదిబ్బకి చెందిన మతిస్థిమితం లేని బాలిక(15) బుచ్చిరెడ్డిపాళెం బంగ్లాసెంటర్ సమీపంలో తిరుగుతుండగా గమనించిన శ్రీనివాసులు, అతడి స్నేహితుడు గడ్డం దిలీప్ ఆ బాలికను బలవంతంగా తమ గుడిసెలోకి తీసుకుని వెళ్లారు. ఆమెతో మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ బాలిక కేకలు పెడుతుంటే నోరు నొక్కే ప్రయత్నం చేశారు. గమనించిన స్థానికులు వారిని నిలదీశారు. ఆమె తమ సోదరి అని, దెయ్యంపట్టి అలా అరుస్తోందని నమ్మించే ప్రయత్నం చేశారు. బాలిక కేకలు ఆపకపోవడంతో స్థానికులు ఇంటిలోకి వెళ్లి చూశారు.
అక్కడ ఆమె అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి.. శ్రీనివాస్ను, దిలీప్ను నిర్బంధించి పోలీసులకు సమాచారం అందించారు. మహిళలు, స్థానిక యువకులు గుడిసెను ధ్వంసం చేసి నిందితులను చితక్కొట్టారు. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి అపస్మారకస్థితిలో ఉన్న బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.