వాళ్లిద్దరూ ఏం దోచుకున్నారయ్యా చంద్రబాబూ?: బొత్స
విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి ఉత్తరాంధ్రను దోచుకోవడానికి వచ్చారంటున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వారిద్దరూ ఏం దోచుకున్నారో అందరికీ చెప్పాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. తమ శాఖలపై స్వారీ చేశారంటున్నారు.. మేమేమైనా చిన్న పిల్లలమా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉత్తరాంధ్రకు చెందిన అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావులకు ఉన్న అధికారాలేంటి? ఇప్పుడు మాకు లేనివేంటో చెప్పాలని నిలదీశారు. మీ హయాంలో రాజులకు పదవులిచ్చారని, బీసీలకు అన్యాయం చేశారని, విజయనగరం జిల్లాకు మీరేం చేశారో చెప్పగలరా? అంటూ సవాల్ విసిరారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ తోటపల్లికి శంకుస్థాపన చేసి వదిలేస్తే దాన్ని వైఎస్ పూర్తిచేశారని, బొబ్బిలి చక్కెర కర్మాగారాన్ని ప్రయివేటు వ్యక్తులకు అప్పగించారని ఆరోపించారు.
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం కోసం అశోక్ గజపతిరాజు ఏం చేశారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలోనే కోర్టు కేసులన్నీ పరిష్కరించి శంకుస్థాపనకు సిద్ధం చేశామన్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందో, చంద్రబాబు ఏం విన్నారో, ఆయనకు ఎలా అర్థమైందో తమకైతే తెలియదని, తమ ప్రభుత్వం ఇళ్లు ఇస్తుందని ఎక్కడైనా అన్నట్లు చంద్రబాబు చూపిస్తే తాము బాధ్యత వహిస్తామన్నారు. తన మేనల్లుడు గానీ, తమ పార్టీ ఎమ్మెల్యేలు గానీ దోచేస్తున్నారని ఎక్కడైనా చూపించగలరా అని నిలదీశారు.