అమరావతిలో అక్రమాలకు ఆధారాలివే.. అసలు కధ ముందుంది..! మంత్రి బొత్సా మరో సంచలనం!!
రాజధాని మీద తన వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కారణమైన మంత్రి బొత్సా సత్యానారాయణ మరో సంచలనానికి తెర లేపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో అక్రమాలు జరిగాయని.. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. దీని మీద బీజేపీ ..టీడీపీ నేతలు సవాల్ చేస్తున్నారు. తన పేరు మీద ఒక్క ఎకరం ఉన్నా బొత్సా నిరూపించాని మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఛాలెంజ్ చేసారు. దీంతో..ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న భూముల వివరాలను బొత్సా బయట పెట్టారు. అదే విధంగా చంద్రబాబు బంధువులకు కట్టబెట్టిన భూముల వివరాలను బహిర్గతం చేసారు. విచారణ సాగిస్తూనే.. రెండో డెవలప్ మెంట్ కొనసాగుతుందని బొత్సా స్పష్టం చేసారు. అదే సమయంలో ఏపీలోని అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలనేది తమ ఉద్దేశమని.. ఏ ఒక్క సామాజిక వర్గానికో రాజధాని పరిమితం కాకూడదని బొత్సా వ్యాఖ్యానించారు. అయితే, అమరావతి రాజధానిగా కొనసాగుటుందనే పరోక్ష సంకేతాలు బొత్సా వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపించాయి.

అమరావతిలో టీడీపీ నేతల అక్రమాలు ఇలా..
రాజధాని పేరుతో తాము ముందు నుండి చెబుతున్న విధంగానే అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ మంత్రి బొత్సా వివరాలను బయట పెట్టారు. ఇది ఆరంభం మాత్రమేనని..సీరియల్ గా అన్ని విషయాలు బయట పెడతామని బొత్సా స్పష్టం చేసారు. కౌలు రైతులు తమకు రావాల్సిన కౌలు గురించి అడిగిన మాట వాస్తవమని..అందులో భాగంగానే కౌలు డబ్బులు విడుదల చేసామని చెప్పుకొచ్చారు. రాజకీయంగాలబ్ది పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. గతంలో ఎప్పుడు వరదలు వచ్చినా బాధితుల నుండి అనేక ఫిర్యాదులు వచ్చేవని..ఈ సారి అటువంటివి లేకుండా సాయం అందించామని బొత్సా వివరించారు. టీడీపీ నేతలు పెయిడ్ ఆర్టిస్టులతో ప్రభుత్వం పైన విమర్శలు చేయించారన్నారు. చంద్రబాబు ఇంటి విషయంలో ప్రభుత్వం పైన అనేక నిందలు వేసారని విమర్శించారు. రైతులకు నష్టం కలిగేలా తమ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోదని బొత్సా తేల్చి చెప్పారు. ప్రభుత్వం పైన ఆరోపణలు చేయటం..టెక్నాలజీ పేరుతో మభ్య పెట్టటమే చంద్రబాబుకు తెలిసిన విద్య అని ఆరోపించారు. అయిదేళ్ల కాలంలో రాజధానిలో కేవలం నాలుగు బిల్డింగ్ లు మాత్రమే శాశ్వత నిర్మాణాలుగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని వివరించారు.

సుజనా భూములు చిట్టా ఇదే..
బీజేపీ ఎంపి..మాజీ కేంద్రం మంత్రి సుజనా చౌదరి మీద బొత్సా మండిపడ్డారు. ఇప్పటికీ తెలుగు దేశం మాటలే సుజనా మాట్లాడుతున్నారని బొత్సా ఫైర్ అయ్యారు. సుజనాకు 120 కంపెనీలు ఉన్నాయని ..అందులో జితిన్ కుమార్.. గ్రీన్ టెక్ కంపెనీ చందర్లపాడు మండలం గుడిమెట్లలో 110 ఎకరాల భూమి ఉన్నదని బొత్సా డాక్యెమెంట్లు బయట పెట్టారు. అదే విధంగా సుజనా సోదరుడి కుమార్తె యలమంచిలి
ఋషికన్య కు కు వీరులపాడు మండలం గోకరాజుపాలెం లో 14 ఎకరాలు ఉందని వివరించారు. ఇక, ఆయన తనకు సంబంధించి ఒక ఎకరం భూమి ఉంటే నిరూపించాలని సవాల్ చేసారని..తాను 110 ఎకరాల కు సంబంధించిన వివరాలను చెబుతున్నాని బొత్సా చెప్పుకొచ్చారు. నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు రామారావుకు 493 ఎకరాలు లక్ష రూపాయల చొప్పున కేటాయించారని బొత్సా వివరించారు. అదే విధంగా ఏపీఐఐసీకి ద్వారా భూమి ఇచ్చి ఆ తరువాత దానిని సీఆర్డీఏలో కలిపారని బొత్సా చెప్పారు. ఇంకా అనేక మంది టీడీపీ నేతల భూముల వివరాలు బయట పెడతామని..ఖచ్చితంగా అందరికీ దక్కాల్సిన భూములు కొంత మంది వద్దే ఉన్నాయని బొత్సా వివరించారు. తమ ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద విచారణ చేస్తుందని.. రైతులకు మాత్రం ఎటువంటి నష్టం లేకుండా చూస్తామన్నారు. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అని..ప్రభుత్వం మారినంత మాత్రాన రైతులకు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉండమని తేల్చి చెప్పారు.

ఒక సామాజిక వర్గానికి చెందినది కాదు..
ఏపీ రాజధాని అంటూ ఒక ప్రాంతానికో..ఒక సామాజిక వర్గానికో చెందినది కాదని బొత్సా స్పష్టం చేసారు. తమ ప్రభుత్వంలో అమలు చేసే ప్రతీ నిర్ణయం అందరికీ అమలు చేస్తున్నామని..రాజధాని మాత్రం ఏ ఒక్క సామాజిక వర్గానికో పరిమితం కాకూడదని పేర్కొన్నారు. గతంలోనే బీజేపీ రాజధాని గురించి ఆరోపణలు చేసిందని..అక్కడ అవినీతి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసందని గుర్తు చేసారు. తమ విధానం ఏపీ మొత్తం అన్ని ప్రాంతాల్లోనూ ఎక్కడా అసమానతలకు అవకాశం లేకుండా పాలన సాగాలనేదే లక్ష్యమని స్పష్టం చేసారు. చంద్రబాబు మాత్రం ఈ ప్రాంతం మాత్రమే డెవలప్ కావాలని ఎందుకు కోరుకుంటున్నారని బొత్సా ప్రశ్నించారు. అయితే, రైతులకు అనుకూలంగా మాట్లాడటం..అదే సమయంలో విచారణ గురించి చెప్పటం ద్వారా వైసీపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications