వరదలో కొట్టుకుపోతుంది: టీడీపీ వస్తే వర్షాలు పడవు, నీళ్లు రావన్న వైసీపీ ప్రచారంపై దేవినేని
అమరావతి: టీడీపీ వస్తే వర్షాలు పడవు, నీళ్లు రావు అంటూ వైసీపీ, వైసీపీ నేతలు చేసిన చెత్త ప్రచారం ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరదలో కొట్టుకుపోతుందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరద పరిస్థితిని గురువారం మంత్రి స్వయంగా పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత వైయస్ జగన్పై నిప్పులు చెరిగారు. కృష్ణా పుష్కరాలకు నీళ్లు రావని వైయస్ జగన్ మహాధర్నా చేద్దామని కుట్ర చేశారని అన్నారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల ఆయన కుట్రలు, కుతంత్రాలు కొట్టుకుపోయాయని అన్నారు.
ఈరోజు గుంటూరు, నల్గొండ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పోర్లుతున్నాయని అన్నారు. ఇప్పటివరకు పులిచింతల ప్రాజెక్టులో 40 టీఎంసీల నీటిని నిలబెట్టామని అన్నారు. 1.84 లక్షల క్యూసెక్కుల నీటిని పులిచింతల ప్రాజెక్టు నుండి విడుదల చేశామని అన్నారు.
ఈ నీళ్లను ఎలా సద్వినియోగం చేసుకోవాలని ఆలోచిస్తున్నామని అన్నారు. అవసరమైతే ప్రకాశం బ్యారేజీ-పులిచింతల మధ్యలో ఇంకో బ్యారేజీని నిర్మాణం చేయాలనే ఆలోచన కలుగుతోందని చెప్పారు. గోదావరి నుంచి రెండు వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్తోందని దేవినేని పేర్కొన్నారు.
పట్టిసీమ ప్రాజెక్టు వల్ల కృష్ణా డెల్టాలో 20 లక్షల ఎకరాలు సాగు అవుతుందని చెప్పారు. ఈ వరదల వల్ల వచ్చిన నీటి ద్వారా పంటలను కాపాడు కోగలమనే ధైర్యం వచ్చిందని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టులో నిల్వ చేసిన 21 టీఎంసీల నీళ్ల వల్ల పది లక్షల ఎకరాలు సాగు అవుతున్నాయని తెలిపారు.
ప్రకాశం బ్యారేజీకి పూర్తిస్థాయిలో నీళ్లు వస్తుండటంతో పట్టిసీమ నీటిని ఆపేసినట్లు ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో గోదావారి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానమే తమ లక్ష్యమని అన్నారు. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికి శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండలేదని అన్నారు.